నాకు ఫోన్ చేస్తే మొహం మీదే తప్పు చేశావ్ అని చెప్పా: కేటీఆర్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-27 14:23:51  IST  )

పార్లమెంటులో తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు.

నాకు ఫోన్ చేస్తే మొహం మీదే తప్పు చేశావ్ అని చెప్పా: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంటులో తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సోమవారం జరిగిన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించి, బీజేపీ ఎంపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోలుస్తూ, ఇదొక వేర్పాటువాద సమస్యగా చిత్రించడంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. "తేజస్వి సూర్య వ్యాఖ్యలు విన్న వెంటనే మా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు గట్టిగా ఖండించారు. ఆ తర్వాతే తేజస్వి సూర్య నాకు ఫోన్ చేసి, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాట్లాడింది ముమ్మాటికీ తప్పేనని నేను కూడా గట్టిగా చెప్పాను" అని కేటీఆర్ వెల్లడించారు.

ఉత్సవ విగ్రహాల్లా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు..

పార్లమెంటులో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర పార్టీల ఎంపీల మౌనాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా, తెలంగాణను అవమానిస్తుంటే ఉత్సవ విగ్రహాల్లా చూస్తూ కూర్చున్నారు తప్ప ఒక్కరూ నోరు మెదపలేదు. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు ఇవాళ స్పష్టంగా కనిపిస్తోందని, తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలను అక్కడికక్కడే అడ్డుకునేవారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని, కేవలం ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ గొంతుకను దిల్లీలో బలంగా వినిపించగలదని ఆయన పునరుద్ఘాటించారు.

కొత్త పార్టీలతో ఒరిగేదేమీ లేదు.. ఆవేశం ఎప్పుడూ పనికికాదు: కవిత పార్టీపై కేటీఆర్ స్పందన

Next Story