KTR: హైదరాబాద్‌కు రండి.. ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌‌కి కేటీఆర్ ఆహ్వానం

by Ramesh Naini |

ప్రముఖ ఏఐ చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ తన మొదటి కార్యాలయాన్ని ఈ ఏడాదిలో ఇండియాలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

KTR: హైదరాబాద్‌కు రండి.. ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌‌కి కేటీఆర్ ఆహ్వానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఏఐ చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) తన మొదటి కార్యాలయాన్ని ఈ ఏడాదిలో ఇండియాలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన భారత్‌కి రాబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది చివరలో భారత్‌లో మా మొదటి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో ఇండియాను సందర్శించనున్నట్లు తెలిపారు. దేశంలో ఏఐ వాడకం అద్భుతంగా ఉందని, గత సంవత్సరం నుంచి చాట్‌జీపీటీ వినియోగదారుల సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరిగిందని ప్రశంసించారు. ఈ మేరకు భారత్‌లో మరిన్ని పెట్టుడులు పెట్టడానికి మేము ఉత్సాహంగా ఉన్నామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. (Hyderabad) హదరాబాద్‌ నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు.

ఇండియాకి స్వాగతం అంటూ శనివారం ఎక్స్ వేదికగా కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ భారతదేశానికి సరైన ప్రవేశ ద్వారామని, ఓపెన్ ఏఐ (Open AI) వంటి సంస్థలకు ఈ నగరం అనువైన స్థావరం అని కేటీఆర్ రాసుకొచ్చారు. హైదరాబాద్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇన్నోవేషన్ వ్యవస్థ కలిగి ఉందని తెలిపారు. టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటి సంస్థలు ఉన్నాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్కమ్ లాంటి ప్రపంచ టెక్ దిగ్గజాలకు ప్రాధాన్యతనిచ్చే కేంద్రంగా ఉందన్నారు. వరుస ప్రభుత్వాలు తెలంగాణను భారతదేశ ఏఐ క్యాపిటల్ సిటీగా చేయడానికి సాహసోపేతమైన చర్యలు తీసుకున్నాయని వెల్లడించారు. 2020ని ఏఐ సంవత్సరంగా ప్రకటించినట్లు తెలిపారు. ఓపెన్ ఏఐ కార్యకలాపాలకు ఎంతో అనుకూలంగా హైదరాబాద్ ఉంటుందని కేటీఆర్ ట్వీట్‌‌లో రాసుకొచ్చారు.

Next Story