డేట్, టైమ్, ప్లేస్ చెప్పు వస్తా.. CM రేవంత్‌కు కేటీఆర్ సంచలన సవాల్

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-16 13:35:34  IST  )

ఏసీబీ విచారణ(ACB Investigation)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు.

డేట్, టైమ్, ప్లేస్ చెప్పు వస్తా.. CM రేవంత్‌కు కేటీఆర్ సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ విచారణ(ACB Investigation)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం విచారణ అనంతరం ఈడీ(Enforcement Directorate) ఆఫీస్ ఎదుట మీడియాతో మాట్లాడారు. మళ్లీ అవే ప్రశ్నలు వేశారని విమర్శించారు. ఈడీ, ఏసీబీ సంస్థలు రెండూ ఒకేలా వ్యవహరిస్తున్నాయి.. ఒకేలా ప్రశ్నిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. ఏం అడిగినా చెబుతానని అన్నారు. లేని అవినీతిపై కోట్లు ఖర్చు చేసి ఎంక్వైరీ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీద ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయి.

అందుకే నా మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. నాపై పెట్టే ఖర్చుతో పథకాలను మరింత సమర్థంగా అమలు చేయొచ్చని కేటీఆర్ అన్నారు. ‘రేవంత్ రెడ్డి వస్తే ఇద్దరం కలిసి జడ్జి ఎదుట కూర్చుందాం.. ఇద్దరి కేసులపై లై-డిటెక్టర్ టెస్టులు చేయించుకుందాం’ అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. జడ్జి ముందు కాకపోయినా.. ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. డేట్, ప్లేస్ రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తే తాను వస్తానని ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డిపై ఉన్న కేసులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు.

ఏసీబీ, ఈడీ విచారణలకు దాదాపు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం తనపై ఖర్చు చేస్తోంది.. అదే ఖర్చు పథకాల అమలుమీద పెట్టే సోయి ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దర్యాప్తు సంస్థలు, విచారణ అధికారులపై ఉన్న గౌరవంతో ఏ తప్పు చేయకపోయినా ఏసీబీ, ఈడీ విచారణకు హాజరవుతున్నానని తెలిపారు. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థను గౌరవిస్తా.. విచారణకు పూర్తిగా సహకరిస్తా అని అన్నారు. వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలతో ప్రజాధనం వృథా చేయొద్దు అని ప్రభుత్వానికి సూచించారు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తానని అన్నారు.

Next Story