మరోసారి ఈ ఫార్ములా కేసు తెర మీదకు తెచ్చే కుట్ర.. ​కేటీఆర్ కీలక వ్యాఖ్యలు​

by Ramesh Naini |

బీఆర్​ఎస్​ కార్యకర్తల గట్టి పట్టుదలతో అద్భుతంగా పోరాటం చేశారని కొనియాడారు. మరోసారి ఫార్ములా ఈ రేసు అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొచ్చే కుట్ర చేస్తోందని, ఇప్పటికే నాలుగు సార్లు పిలిచిన ఒరగబెట్టింది ఏమీ లేదని, మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారన్న సమాచారం ఉందని కేటీఆర్ అన్నారు.

మరోసారి ఈ ఫార్ములా కేసు తెర మీదకు తెచ్చే కుట్ర.. ​కేటీఆర్ కీలక వ్యాఖ్యలు​
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్​ ఎన్నికల్లో తాము 30 మున్సిపాలిటీలో గెలుస్తామని అంచనా వేస్తే ఆశించిన ఫలితాలు రాలేదని, ఎక్కువగా ఫలితాలు వచ్చిన అధికార కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందని బీఆర్​ఎస్ ​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ కార్యకర్తల గట్టి పట్టుదలతో అద్భుతంగా పోరాటం చేశారని కొనియాడారు. మరోసారి ఫార్ములా ఈ రేసు అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొచ్చే కుట్ర చేస్తోందని, ఇప్పటికే నాలుగు సార్లు పిలిచిన ఒరగబెట్టింది ఏమీ లేదని, మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారన్న సమాచారం ఉందన్నారు. ఎన్ని సార్లు పిలిచినా తాము వెళ్తామని, ఉన్న సత్యం స్పష్టంగా చెబుతామని కుండ బద్దలు కొట్టారు. చివరికి జైల్లో పెట్టినా భయపడేది లేదని ఆ కేసులో ఎలాంటి పస లేదనే విషయం పోలీస్ అధికారులు, ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. శనివారం మీడియాతో చిట్​చాట్ ​నిర్వహించారు.

హంగ్ మున్సిపాలిటీల్లో విజయావకాశాలు..

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తమకు వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా మాకే విజయావకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. వారికి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయని పార్టీ జాతీయ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రి ప్రచారం చేసిన ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేకపోయింది. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో మినహాయించి బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఉండదని, స్థానిక అంశాలతో పాటు ప్రభుత్వ అధికారంలో ఉన్నవాళ్లకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయి. ఈ ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రవాహం పెరిగి కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. తమకు ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశాయి. పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా గట్టిగా కొట్లాడారని, గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికలే సమాధానం ఇచ్చాయన్నారు.

కలెక్టర్లు ఒక మాట, చీఫ్ సెక్రటరీ ఒక మాట..

ఎక్స్ అఫీషియో సభ్యుల నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదు. కలెక్టర్లు ఒక మాట, చీఫ్ సెక్రటరీ ఒక మాట చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలపై ఎవరికీ స్పష్టత లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు గ్రేటర్​లో ఎన్ని గెలిచారని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులకు స్పష్టమైన సందేశం ఇవ్వాలనే ఆలోచనతోనే కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

Next Story