చేతనైతే ఢిల్లీలో నిరుద్యోగ మార్చ్ చేయ్.. బండిపై కూనంనేని ఫైర్

by Dishanational2 |
చేతనైతే ఢిల్లీలో నిరుద్యోగ మార్చ్ చేయ్.. బండిపై కూనంనేని ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఖమ్మం కొచ్చి నిరుద్యోగ మార్చ్‌ చేయడమ కాదని, చేతనైతే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని విఫలమైనందుకు ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసం వద్ద నిరుద్యోగ మార్చ్‌ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్‌ విసిరారు. బండి తన నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆయన నోరు యాసిడ్‌తో కడగడం కాదని, నిప్పులు పోసికడిగినా బాగుపడదని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ లాంటి పార్టీలు సమాజానికి పట్టిన చీడ అయితే దానికి పట్టిన పీడ బండి సంజయ్‌ అని, అడ్డుఅదుపులేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ సంస్కారం లేకుండా సంజయ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని, ఖమ్మం జిల్లాకు రాగానే పూనకం వచ్చినట్లు మాట్లాడటం తగదని హెచ్చరించారు. ఏవో కొన్ని స్థానాలు గెలిచిన బీజేపీ అహంకారంతో ఖమ్మం జిల్లాలో ఇతర పార్టీలను ప్రస్తావన చేస్తూ కమ్యూనిస్టుల పని కూడా అయిపోయిందని పిచ్చివాడు స్వర్గంలో విహరిస్తున్నట్టుగా అవాకులు చెవాకులు పేలుతున్నాడని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఓట్లు, సీట్లు కోసం ఏనాడూ తహతహలాడదని, సీట్లకు కోసం బీజేపీ లాగా అడ్డమైన పనులకు పాల్పడమని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఇప్పుడు గెలిచినస్థానాలకు బండి సంజయ్‌ గెలిచిన పార్లమెంట్‌ స్థానం కూడా తిరిగి గెలిచే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి ఖమ్మం జిల్లా ప్రజలు బీజేపీని అధికారమేమోగాని, కనీస స్థానాలను కూడా గెలవనివ్వరని కూనంనేని ఫైర్ అయ్యారు.


Next Story

Most Viewed