దిగ్విజయ్ సింగ్‌కు కొండా సురేఖ సంచలన లేఖ.. తనకు పీసీసీ ఇవ్వాలని విజ్ఞప్తి

by Disha Web Desk |
దిగ్విజయ్ సింగ్‌కు కొండా సురేఖ సంచలన లేఖ.. తనకు పీసీసీ ఇవ్వాలని విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీకాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇక్కడ సీనియర్ నాయకులతో మాట్లాడి.. కలిసి కట్టుగా ఉండాలని తన వంతుగా చెప్పవలసింది చెప్పి వెళ్లిపోయారు. అయినప్పటికీ పార్టీ నాయకుల్లో పదవుల పంచాయితీ నివురుగప్పిన నిప్పులా అలాగే రాజుకుంటుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ దిగ్విజయ్ సింగ్‌కు లేఖ రాశారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఆ లేఖను విడుదల చేశారు. తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వాలని లేఖలో దిగ్విజయ్‌ను కోరారు. ఈ మేరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. తనను పీఈసీ సభ్యురాలిగాఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.

అయితే 27 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన తనను ఏఐసీసీ కార్యదర్శిగా లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా అడిగినట్లు లేఖలో పేర్కొన్నారు. రాజకీయాల్లో తనకు దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉందని దిగ్విజయ్ సింగ్కు రాసిన లేఖలో కొండా సురేఖ ప్రస్తావించారు. మహిళా సాధికారత సాధించేందుకు తనకు అన్ని నైపుణ్యాలు ఉన్నాయన్నారు. టీపీసీసీలోని మహిళలు దేశంలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో తాను చేసిన సేవ, వారితో కలిగిన సంబంధాలు, నెట్‌వర్కింగ్ సామర్థ్యంతో ఏఐసీసీ సెక్రటరీ లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌లకు తాను అర్హురాలినని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ఈ పదవుల్లో ఏది ఇచ్చినా.. వంద శాతం వాటికి న్యాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతీ కార్యకర్త.. కాంగ్రెస్ పనితీరు పట్ల సంతోషంగా, సంతృప్తిగా ఉండేలా చూస్తానని భరోసా ఇచ్చారు. మరోవైపు, తాను 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. 27 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని లేఖలో పేర్కొన్నారు. తన భర్త కొండా మురళీధర్ రావు రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు గుర్తు చేశారు. తామిద్దరం వెనుకబడిన తరగతుల నుంచి వచ్చి.. తెలంగాణతో పాటు.. ఏపీ రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నామన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోందని.. తనకు ఏఐసీసీ కార్యదర్శి లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇస్తే.. తన నైపుణ్యంతో కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరిగేలా కృషి చేస్తానని లేఖలో కొండా సురేఖ పేర్కొన్నారు.


Next Story