భువనగిరి ఎంపీ స్థానంపై కోమటిరెడ్డి ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 13 |
భువనగిరి ఎంపీ స్థానంపై కోమటిరెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీ గెలిచినం.. ఇక పార్లమెంట్ లో గెలవబోతున్నాం’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఒక అన్నగా తోడుగా ఉంటానని ప్రకటన చేశారు. భువనగిరి కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటూ ట్వీట్ చేశారు.

కాగా భువనగిరి లోక్ సభ టికెట్ ను కోమటిరెడ్డి కుటుంబం ఆశించిన సంగతి తెలిసిందే. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వర్గీయుడిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో చామల కు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ మేరకు సహకరిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ఓటర్ కు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంతగా పరిచయం లేకపోవడం, అక్కడ బీజేపీ నుంచి భూర నర్సయ్య గౌడ్ వంటి బలమైన బీసీ నేత ప్రత్యర్థి ఉండటం కాంగ్రెస్ గెలుపుకు సవాలుగా మారింది. అక్కడ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సైతం స్వయంగా రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి భువనగిరి స్థానం గెలుపుపై ఇటీవల కీలక దిశానిర్దేశం చేసి రాగా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Next Story