సుదర్శన్ రెడ్డిని అర్బన్ నక్సలైట్ అనడం తగదు.. అమిత్ షా వ్యాఖ్యలపై కోదండరామ్‌ ఫైర్

by Ramesh Naini |

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించాలని ప్రొఫెసర్ కోదండరామ్ (Professor Kodandaram) పిలుపునిచ్చారు.

సుదర్శన్ రెడ్డిని అర్బన్ నక్సలైట్ అనడం తగదు.. అమిత్ షా వ్యాఖ్యలపై కోదండరామ్‌ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించాలని ప్రొఫెసర్ కోదండరామ్ (Professor Kodandaram) పిలుపునిచ్చారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy)కి మద్దతుగా విద్యావంతులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రముఖ సామాజిక కార్యకర్తల నుంచి సేకరించిన సంతకాల పత్రాన్ని ప్రముఖ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ కోదండరామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాదు.. భారతదేశ భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య సంస్థల నిలకడపై జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. దేశంలో పౌరుల హక్కులు బలహీనమవుతున్న ఈ సమయంలో, ఈ ఎన్నిక దేశ ముఖచిత్రానికి దిక్సూచిగా నిలవాలని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడే శక్తులు ఒకవైపు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఒకవైపు ఉన్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు.

ఇప్పటివరకు విద్యావంతులు, మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తదితరులు 155 మంది సంతకాలు చేసినట్లు తెలిపారు. ఈ సంఖ్య త్వరలో మరింత పెరుగుతుందన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ “ అర్బన్ నక్సలైట్ అంటే ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అర్బన్ ఏరియా లో పని చేసినంత మాత్రాన ముద్ర వేయడం ఏంటీ? సుదర్శన్ రెడ్డి‌ని అర్బన్ నక్సలైట్ అని పిలవడం తగదు. ఆ పదానికి అర్థం లేదు. అర్బన్ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం కోసం పని చేసే వారిని నక్సలైట్లు అనడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యాన్ని కోరుకోవడం తప్పయితే అంతకన్నా ప్రమాదకరమైనది ఇంకేమీ ఉండదు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు తెలియని వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు” అని తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Next Story