Kishan Reddy: భారత్, బ్రిటన్​దేశాల మధ్య ఒప్పందం మైలురాయిగా నిలవనుంది

by Gantepaka Srikanth |

భారత్ - బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్వాగతించారు.

Kishan Reddy: భారత్, బ్రిటన్​దేశాల మధ్య ఒప్పందం మైలురాయిగా నిలవనుంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ - బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్వాగతించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందంగా నిలిచిపోతుంది. ప్రధాని మోడీ ఈ విషయం మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ఆత్మ నిర్భర భారత్ లక్ష్యాలను నెరవేర్చడంలో కీలకంగా మారనుంది. ఈ ఒప్పందంతో దేశంలోని వస్త్ర పరిశ్రమ, సముద్ర ఉత్పత్తులు, లెదర్ ఉత్పత్తులు, ఫుట్‌వేర్ రంగం, రాళ్లు, ఆభరణాల రంగం, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆర్గానిక్ రంగాలకు లబ్ధి చేకూరుతుంది. భారతదేశం నుంచి బ్రిటన్ దిగుమతి చేసుకునే దాదాపు 99 శాతం ఉత్పత్తులపై ఎలాంటి సుంకం ఉండదు. దీంతో మన దేశం నుంచి భారీగా ఎగుమతులు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగ అవకాశాలు పెరడగంతో పాటు దేశ ఆర్థికవృద్ధికి ఈ ఒప్పందం ఊతమిస్తుంది. ఈ ఒప్పదం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన లబ్ధి జరగనుంది.

మన రాష్ట్రంలోని చేనేత వస్త్రాలను బ్రిటన్‌‌కు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం కానుంది. దీని కారణంగా.. మన నేతలన్నకు లబ్ధి చేకూరనుంది. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ సేవల్లో ప్రపంచ గుర్తింపును పొందిన నేపథ్యంలో తాజా ఒప్పందంతో మన ఐటీ సర్వీసులకు మరింత లబ్ధిచేకూరనుంది. బ్రిటన్‌కు ఎగుమతులు పెరగడంతో వికసిత భారత్ లక్ష్యాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిన్నట్లు చెప్పారు. 2024లో బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దేశాన్ని పరుగులు పెట్టించేందుకు మోడీ చేస్తున్న కృషిని ఈ ఒప్పందం మరో అడుగు ముందుకు తీసుకెళ్లనుంది. ఇటీవలే, జపాన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిన సంగతి తెలిసిందే. 2030 నాటికి 7 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం దూసుకెళ్తున్న సందర్భంలో బ్రిటన్‌తో జరిగిన ఈ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ఓ మైలురాయిగా నిలవనుందన్నారు.

Next Story