నేను అంత అవివేకిని కాదు.. CM రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను అంత అవివేకిని కాదు.. CM రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సహనం, అవగాహన లేకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతున్నానని.. ఇప్పటికే ఎన్నో నిధులు తీసుకొచ్చానని అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) విఫలం చెందిందని అన్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసినంత మాత్రాన.. రేవంత్, కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత తగ్గదని కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడే కాదు.. సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన తొలిరోజు నుంచే ప్రజలు రేవంత్ మాటలను సీరియస్‌గా తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకారంతో తెలంగాణలో రూ.10 లక్షల కోట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. తాను బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నానన్నది అవాస్తవమని అన్నారు. నన్ను తిట్టిన వాళ్లను కూడా ఎప్పుడూ బెదిరించలేదని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునే అవివేకిని కాదని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా, కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడం లేదని.. తెలంగాణ పాలిట ఆయన సైంధవుడిలా మారారని శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కిషన్‌ రెడ్డి వల్లే మెట్రో ప్రాజెక్టు, కిషన్ రెడ్డి వల్లే ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు, కిషన్‌ రెడ్డి వల్లే మూసీ ప్రక్షాళన ఇలా అనేక కీలక పనులు కిషన్ రెడ్డి వల్లే ఆగిపోయాయని అన్నారు. తామేం ప్రధాని మోడీ వ్యక్తిగత ఆస్తుల్ని అడగడం లేదు.. రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు వెళ్తున్నాయి.. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ యూపీ, బిహార్‌లకే ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Next Story