ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వార్ వన్ సైడే: ఎంపీ నామా నాగేశ్వరరావు

by Disha Web Desk 1 |
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వార్ వన్ సైడే: ఎంపీ నామా నాగేశ్వరరావు
X

దిశ, వైరా: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వార్ వన్ సైడేనని ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మండల, పట్టణ నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభకు నామా నాగేశ్వరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనన్నారు.

ఒకప్పుడు వరి అన్నం పండగ రోజు తినే స్థాయి నుంచి ప్రస్తుతం భారతదేశం మొత్తానికి ధాన్యాన్ని అందించే స్థాయికి రాష్ట్రం ఎదగడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో మూడోసారి స్పష్టమైన మెజారిటీతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పని చేయాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తో పెట్టుకున్నోళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 ప్రాంతీయ పార్టీలను స్థాపిస్తే కేవలం రెండు పార్టీలు మాత్రమే తమ ప్రయాణాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అహంకార పాలనకు వ్యతిరేకంగా 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం, ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలే ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ చేసిన త్యాగాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. డిసెంబర్ నెలలో ఎన్నికలొచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికల బాధ్యత స్వయంగా సీఎం కేసీఆర్ తీసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పొంగులేటి వర్గీయులను ఉరికించి ప్రజలు కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని అన్నారు.

పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, వైరా ఎంపీపీ పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, మచ్చా వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Next Story