సమస్యలకు నిలయంగా ట్రైబల్ హాస్టల్..

by Chintha Aamani |

ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న కొనిజర్ల బాలుర కళాశాల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ సమస్యలకు నిలయంగా మారింది.

సమస్యలకు నిలయంగా ట్రైబల్ హాస్టల్..
X

దిశ, మయూరి సెంటర్ : ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న కొనిజర్ల బాలుర కళాశాల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ సమస్యలకు నిలయంగా మారింది. ఈ హాస్టల్ ను ప్రస్తుతం ముస్తాఫ్ నగర్ పరిసర ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసే వార్డెన్ విధులకు సక్రమంగా హాజరు కావట్లేదు; అనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్ లో పరిశుభ్రమైన మంచినీరు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. టాయిలెట్స్ నుంచి విపరీతమైన కంపు కొడుతుందని, హాస్టల్ లో నిద్రించడం కష్టంగా మారిందని వసతి గృహ విద్యార్థులు వాపోతున్నారు. శిధిలావస్థకు చేరిన బాత్రూమ్స్ లలో మురుగు పేరుకుపోయి విపరీతమైన కంపు వాసన కొడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం కావడంతో, వసతి గృహం పరిసరాలను శుభ్రంగా ఉంచాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు వేడుకుంటున్నారు.

హాస్టల్ వార్డెన్ పై జిల్లా అధికారులకు ఫిర్యాదు..

తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ (టిఎస్ఎస్ఏ)రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనిజర్ల కళాశాల బాలుర వసతి గృహంలో పనిచేసే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ట్రైబల్ డిప్యూటీ డైరెక్టర్ (డిడి) కి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన డిప్యూటీ డైరెక్టర్ ఫోన్లో వార్డెన్ ను సంప్రదించడానికి ప్రయత్నించారు. వార్డెన్ ఫోన్ అందుబాటులో లేకపోవడంతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డైరెక్టర్ హామీ ఇచ్చినట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి. ఇప్పటికే గొల్లగూడెం పాఠశాల విద్యార్థిని అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Next Story