అప్పుడు ఓకే, ఇప్పుడు ఎస్కేప్.. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల ధోరణి

by Disha Web Desk 1 |
అప్పుడు ఓకే, ఇప్పుడు ఎస్కేప్.. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల ధోరణి
X

దిశ, ఖమ్మం సిటీ : బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం నగరంలో కొంతమంది నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగానే ‘దిశ’ సర్వే నెంబర్ 94లో 175 గజాల భూమిపై వరుస కథనాలు ప్రచురిస్తూ వచ్చింది. ఇదే విషయంపై నగర పాలక సంస్థ కమిషనర్ దిశ ప్రతినిధి కలిసి మంగళవారం వివరణ కోరారు. సర్వే నెంబర్ 94లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు ఎలా ఇచ్చారో ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ నుంచి పట్టా భూమికైనా, రిజిస్టర్ డాక్యుమెంట్ కలిగిన భూమికైనా ఇంటి నెంబర్లు ఇస్తామని తెలిపారు.

మేము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారానే ఆ ఇంటికి అనుమతులు ఇచ్చినట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి చెల్లించాల్సిన రుసుము కడితేనే ఆ ఇంటికి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఒకవేళ అది పట్టా భూమి అయితే.. ముందుగా రిజిస్ట్రేషన్ శాఖ వారే తప్పు చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. కేవలం తాము ఇంటి డాక్యుమెంట్లు ఆధారంగానే అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. 2004లో ఓ తహసీల్దార్ పంపిణీ చేసిన ఇండ్ల పట్టాల్లో అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు. 2011లో ఇచ్చిన ఇండ్ల పట్టాల విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని తెలిపారు. అదేవిధంగా లైసెన్స్ సర్వేయర్ వెంకట్రావు తన లాగిన్‌లో వేరొకరు తప్పులు చేసినట్లు పేర్కొన్నారని దిశ ప్రతినిధి ప్రశ్నిచడంతో కమిషనర్ సమాధానం తెలుపుతూ.. అలా ఎలా జరిగిందని, ఆయన లాగిన్‌లోకి వేరొకరూ ఎలా తప్పులు చేస్తారు. ఒకవేళ తప్పు జరిగి ఉంటే ఆ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు సర్వే నెంబర్ 94లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ధరణి పోర్టల్‌లో స్పష్టంగా కనబడుతుంది. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం నగరంలో ఆనాటి ప్రభుత్వంలో పనిచేసిన తహసీల్దార్ అత్యధిక మంది పేదలకు ఇండ్ల పట్టాలు అందజేసినట్లు సమాచారం. అప్పటి తహసీల్దార్ పంపిణీ చేసిన పట్టాలను కొంతమంది వ్యక్తులు నకిలీ పట్టాలు తయారు చేసి వాటిని అన్యాక్రాంతం చేసి జైలు జీవితాలు కూడా అనుభవించారు. ప్రస్తుతం అదే తహసీల్దార్ తెలంగాణ రాష్ట్రంలోనే జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ విషయాన్ని సాకుగా చూపి ఆ తహసీల్దార్ మంజూరు చేసిన పట్టాలు ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ తప్పుడువి అన్నట్లు నిర్ధారించడం పలు విమర్శలకు తావిస్తోంది. అసలు అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేసి ఎప్పుడో మంజూరు చేసిన పట్టాలు ఒరిజనల్ లేదా డూప్లికేటా అని తేల్చడంలో తాత్సారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రభుత్వ భూమి అయితే చర్యలు : మున్సిపల్ కమిషనర్

రిజిస్ట్రేషన్ అధికారులు బురిడీ కొట్టించి సర్వే నెంబర్ 94లో 175 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న గంగసాని అప్పారావు, బిక్కసాని సాయి గీత, లబ్ధిదారుల నుంచి ప్రభుత్వ భూమిని అక్రమంగా అనుమతులు లేకుండా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సంబంధిత శాఖ నుంచి ఇచ్చిన భవన నిర్మాణ అనుమతుల విషయంలో తప్పులు దొర్లుంటే ఆంధ్ర ప్లానర్ వెంకట్రావుపై చర్యలు ఉంటాయని ఆయన వెల్లడించారు.


Next Story