ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి

by Taduka Kalyani |

ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పేర్కొన్నారు.

ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్ : ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో ఏఈఆర్వో లు, సూపర్వైజర్లు, బీ ఎల్ వో లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం 55 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన మ్యాపింగ్‌ను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మ్యాపింగ్ పూర్తయినంతవరకు ఐదు నుంచి ఆరు రోజుల్లో డిజిటలైజేషన్ పూర్తి చేయాలని, డిజిటలైజేషన్ నివేదికలో పురోగతి కనిపించేలా అధికారులు పనిచేయాలని అన్నారు. ఇప్పటివరకు ఎంత మేరకు డిజిటలైజేషన్ పూర్తయిందనే వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. ప్రతి బీ ఎల్ వో పరిధిలో అవసరమైన వాలంటీర్లు అందుబాటులో ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకుని, డిజిటలైజేషన్ సమయంలో వాలంటీర్ల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని తెలిపారు. ఫారాలను సేకరించే సమయంలో వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసి, డిజిటలైజేషన్‌ చేయాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఏఈ ఆర్ వో లు, సూపర్వైజర్లు, బీ ఎల్ వో లు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఫారాల సేకరణ, అనంతరం మధ్యాహ్నం తర్వాత డిజిటలైజేషన్ పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. రోజులో సగం సమయాన్ని ఫారాల సేకరణకు, మిగిలిన సగం సమయాన్ని డిజిటలైజేషన్‌కు కేటాయించి లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా సమన్వయంతో పనిచేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, ఒకరికొకరు సహకారం అందించుకుంటూ వాలంటీర్ల సహాయంతో డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.

Next Story