ప్రసాదంగా మారిన ప్రభుత్వ భూమి.. మౌనంగా స్థానిక అధికారులు

by Web Desk |
ప్రసాదంగా మారిన ప్రభుత్వ భూమి.. మౌనంగా స్థానిక అధికారులు
X

దిశ, మణుగూరు: ప్రభుత్వ భూములను కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి పాలారంగా పంచుకొని, ప్లాట్లుగా మార్చి కోట్లు గడిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం మౌనంగా చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ భూములే టార్గెట్‌గా పెట్టుకున్న భూకబ్జాదారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక పంచాయతీ రెవెన్యూ లోని సర్వే నెం.189/1 ప్రభుత్వ భూమిని స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇండ్లు నిర్మిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సర్వే నెం.189/1 ప్రభుత్వ భూమిని గతంలో భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ ప్రభుత్వ భూమి అని నిర్ధారణ చేసి ఫెంచింగ్ వేసి స్థానిక పంచాయతీ, రెవెన్యూ అధికారులకు అప్పగించారని స్థానికులు తెలిపారు.

సర్వే నెం.189/1 ప్రభుత్వంభూమిని పల్లె ప్రకృతి వనానికి.. డంపింగ్ యార్డు పనుల కోసం ఉపయోగించాలని ఐటీడీఏ పీవో గౌతమ్ ఆనాడు అధికారులకు సూచించారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ బదిలీపై ఖమ్మం వెళ్లారు. ఈ నేపద్యంలో సర్వే నెం.189/1 ప్రభుత్వ భూమికి ఉన్న ఫెంచింగ్ తొలగించి కబ్జా చేసి ఇండ్లు నిర్మిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రభుత్వ భూమి విషయంపై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక పంచాయతీ, రెవిన్యూ అధికారులు కబ్జాదారులు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ భూములను పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక అధికారులే సర్వే నెం.189/1 ప్రభుత్వంభూమిని కబ్జాదారులకు అప్పగించరనే ఆరోపణలు కూడా మండలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమి అని తెలిసి, కబ్జా చేశారని తెలిసిన స్థానిక అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభుత్వ భూమిపై అధికారులకు ముడుపులు బాగానే అందాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడే అధికారులే లేరని స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడి, కబ్జాదారులపై పీడి యాక్ట్ కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed