ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల మాయ..

by Disha Web Desk 20 |
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల మాయ..
X

దిశ, ఖమ్మం సిటీ : ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ఖమ్మంలో పెద్ద ఎత్తున ఏజెన్సీలు ఏర్పడి నిరుద్యోగులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఇది ఒక మాయని ఒకసారి ఉద్యోగంలో చేరిన వ్యక్తికి నిబంధనల ప్రకారం జీతం పడడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వశాఖల్లో పని చేసేందుకు సిబ్బంది కొరత ఏర్పడడంతో ఆ శాఖల నుండి ఒప్పంద కార్మికులను, ఉద్యోగులను నియమిస్తున్నారు. ఇది అదునుగా చేసుకున్న కొన్ని ఏజెన్సీలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఒక్కొక్కరి వద్దనుండి లక్షల్లో డిమాండ్ చేస్తూ వారికి ఉద్యోగం ఇప్పిస్తామంటూ చుక్కలు చూపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. చివరాఖరికి వారికి ఉద్యోగం ఇచ్చిన భద్రత మాత్రం కల్పించడం లేదని ఎక్కువ పనికి తక్కువ జీతం ఇస్తూ వారిని ఇష్టానుసారంగా బదిలీలు చేస్తూ పోవడంతో ఇబ్బందులు ఎదుర్కోలేక ఉద్యోగం వదులుకునేలా చర్యలకు పాల్పడడంతో లక్షల్లో డబ్బులు పెట్టినా వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేరొందిన ఏజెన్సీ కంపెనీలు మరొక అడుగు ముందుకేసి నిరుద్యోగ యువతను వారి సొంతానికి వాడుకుంటూ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినపడుతున్నాయి. ఏజెన్సీల నిబంధనలు ప్రకారం ప్రతికార్మికుడికి కానీ ఉద్యోగి గాని వారి జీతభత్యాలు బట్టి పీఎఫ్, ఈఎస్ఐలు పోగా మిగిలిన జీతం నేరుగా వారికి ఖాతాలోకి చేరాలి కానీ అదేమీ జరగకుండానే నెలలు తరబడి జీతాలు వేయకుండా ఏజెన్సీల నిర్వాహకులు వారి రక్తాన్ని పీల్చుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఒప్పంద పద్ధతిలో నియామకమైన కార్మికునిగాని ఉద్యోగం కానీ భద్రత కల్పించాల్సిన ఏజెన్సీలు అటువైపు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. కనీసం కంప్యూటర్ ఆపరేటింగ్, కార్యాలయ సెక్షన్లో పనిచేసే వారికి కావాల్సిన అర్హతలు లేకుండానే డబ్బులు తీసుకుంటూ అనఅర్హులకు ఉద్యోగాలుఇస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఏ నెల జీతం ఆ నెల అంది తమకుటుంబాలకు ఆసరా అవుతుంది అనుకున్న వారికి ఏజెన్సీల నిర్వాహకులు చేస్తున్న ఎకిలి చేష్టలకు వాళ్ల కుటుంబాలు రోడ్లపాలవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని కుదిరి ఒకవేళ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగికి అందాల్సిన సమయంలో జీతం అందక చివరికి కట్టిన డబ్బులు రాక ఏం చేయాలో తెలియని అయోమయంలో కొంతమంది యువతీ యువకులు అఘాయిత్యాలకు పాల్పడుతున్న విమర్శలు లేకపోలేదు. ఏజెన్సీల నిర్వాహకులు ఉన్నత స్థాయి అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకొని జీవితాల సమయంలో ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో పడాల్సిన జీతాన్ని వారే నేరుగా డ్రా చేస్తూ నెల మొత్తం కష్టపడి పనిచేసిన వారికి ఎలాంటి ఆసరా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అప్పటికి ఏజెన్సీల దోపిడీకి నిరుద్యోగులు వారి కుటుంబాలను సైతం రోడ్లపై పడేసుకుంటున్నారని ఒప్పంద కార్మిక ,ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Next Story