రైస్‌మిల్ నిర్వాకం.. సీఎం ప్రకటించినా ఆగని దోపిడీ

by Disha Web Desk 6 |
రైస్‌మిల్ నిర్వాకం.. సీఎం ప్రకటించినా ఆగని దోపిడీ
X

దిశ, వైరా: ఆరుగాలం కష్టించి, శ్రమించి పంటలు పండించిన రైతన్నలను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని మిల్లర్లు కోత పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. సొసైటీల ఆధ్వర్యంలో నాణ్యమైన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసినా మిల్లర్ల కోతల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. మిల్లర్లు ధాన్యం కోతను విధిస్తే సహించనని స్వయాన సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నీటి మీద రాత లాగా మారింది. కొణిజర్ల మండలం లాలా పురం గ్రామం సమీపంలో ఉన్న సార్ రైస్ మిల్ లో ఓ రైతుకు సంబంధించి 14 క్వింటాల ధాన్యాన్ని కోత విధించడం తీవ్ర విమర్శలు దారితీస్తుంది. ఇష్టానుసారంగా కోత విధించిన మిల్లర్ యజమానులు ధాన్యాన్ని మాకు నచ్చితే తీసుకుంటాం లేకుంటే లేదు అని వ్యాఖ్యానించడం విశేషం. మిల్లర్లతో సొసైటీ అధికారులు కుమ్మక్కై రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

కొణిజర్ల మండలంలోని లాలాపురం గ్రామంలో ఉన్న సార్ బాయిల్డ్ రైస్ మిల్ ఓ రైతుకు సంబంధించిన 14 క్వింటాళ్ల ధాన్యాన్ని కోత విధించింది. కల్లూరు మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు గుగులోతు నాగరాజు నారాయణపురం సొసైటీ కొనుగోలు కేంద్రంలో గత మార్చి 29వ తేదీన 352 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించాడు. సొసైటీ నిబంధనల ప్రకారం 17 శాతం లోపు తేమ, ఐదు శాతం లోపు పక్వానికి రాని గింజలు, ఒక్క శాతం తాలు, మూడు శాతం లోపు గడ్డి గింజలు ఉన్నాయా లేదా అని సొసైటీ అధికారులు పరిశీలించిన తర్వాత ఈ ధాన్యాన్ని కాంట వేయించారు. రైతుకు కోయించిన ధాన్యాన్ని తూర్పారబట్టి ఎండబెట్టి సొసైటీకి విక్రయించాడు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని విక్రయించినా ఆరైతు కంట కన్నీరే మిగిలింది. ఈ ధాన్యాన్ని లాలాపురం లోని సార్ రైస్ మిల్లుకు సొసైటీ అధికారులు కేటాయించారు. అయితే 352 క్వింటాళ్ల ధాన్యంలో 14 క్వింటాళ్ల ధాన్యం కోతను సార్ రైస్ మిల్ యజమానులు విధించారు. దీనికి సంబంధించిన బిల్లులను రైతు నాగరాజుకు లారీ డ్రైవర్ ద్వారా పంపారు. దీంతో తీవ్ర మనో వేదిక గురైన నాగరాజు సార్ రైస్ మిల్ ఆగడాలను దిశకు వివరించారు.

సీఎం కేసీఆర్ మిల్లర్లు ధాన్యం కోత విధించకూడదని స్పష్టమైన ప్రకటన చేసినా మిల్లర్లు పట్టించుకోవడం లేదు. ఈవిషయమై సార్ రైస్ మిల్ ఎండీ రమణను దిశ వివరణ కోరింది. తమ మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించిన తర్వాతే కోతను విధిస్తున్నామని స్పష్టం చేశారు. మాకు నచ్చితే రైతులు ధాన్యాన్ని తీసుకుంటాం.... లేకుంటే లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే కోతను విధించామని చెప్పారు. తమ వద్ద ధాన్యానికి కోత విధించామనుకుంటే రైతు నాగరాజు తన ధాన్యాన్ని తిరిగి తీసుకువెళ్ళవచ్చునని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed