రాజన్న కుటుంబం అంటే జగమంత కుటుంబం: వైఎస్​ విజయమ్మ

by Disha Web Desk 11 |
రాజన్న కుటుంబం అంటే జగమంత కుటుంబం: వైఎస్​ విజయమ్మ
X

దిశ, ఖమ్మం రూరల్​: వైయస్సార్ ప్రతి క్షణం పేదల గురించే ఆలోచించే వారని, రాజన్న కుటుంబం అంటే జగమంత కుటుంబం అని వైఎస్​ విజయమ్మ అన్నారు. గురువారం రూరల్​ మండలం సాయిగణేష్​ నగర్​లో ఏర్పాటు చేసిన వైఎస్​ షర్మిల పాలేరు క్యాంపు కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో మాట తప్పని, మడమ తిప్పని వైయస్సార్ అని, షర్మిల కూడా మాట ఇస్తే ఎందాకైనా వెళ్తుందన్నారు. చిత్తశుద్ధితో రాజకీయాలు చేయాలనే షర్మిల ప్రజాప్రస్థానం మొదలు పెట్టిందన్నారు.

ఎన్ని అవమానాలు చేసినా అన్నింటా ముందుకే అడుగేస్తుందన్నారు. ప్రజాప్రస్థానం 4వేల కి.మీ, అంతకు ముందు 3వేల కి.మీ షర్మిల నడక వైయస్సార్ బంగారు పాలన కోసమే అని స్పష్టం చేశారు. షర్మిల అడ్రస్ ఎక్కడా అంటే పాలేరు అనే చెప్తున్నామని, రానున్న రాజకీయాలకు షర్మిల పాలేరు నిర్ణయం గుమ్మం అవుతుందన్నారు. ప్రతి కుటుంబంలో షర్మిలను గుండెలలో పెట్టుకుంటారన్నారు. షర్మిల 4కోట్ల తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. వైయస్సార్ ప్రేమా, మానవత్వం షర్మిల ప్రజలకు పంచుతోందన్నారు. పాలేరు నుంచే తెలంగాణను పరిపాలిస్తుందన్నారు. మంచి నాయకులుంటే మంచి పరిపాలన రాష్ట్రంలో ఉంటుందన్నారు.

దివంగత వైయస్సార్ కు పాలేరుకు రూణానుబంధం ఉందని ఇదంతా దైవేచ్చే అన్నారు. ఎల్లప్పుడూ ఖమ్మం జిల్లా మాకు అండగానే నిలిచిందన్నారు. ఎప్పుడో వైయస్సార్ పాలనలో మొదలెట్టిన ప్రాజెక్టులు ఇప్పటిదాకా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఆంధ్రాలో పులివెందుల ఎలానో, తెలంగాణ లో పాలేరు కూడా అలాగే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్కినేని సుధీర్, షర్మిల వ్యక్తిగత సహాయకుడు నంద్యాల రవీందర్ రెడ్డి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed