వెనుకబడ్డ బయ్యారం.. ఏజెన్సీ అభివృద్ధిని మరిచిన పాలకులు

by Dishanational2 |
వెనుకబడ్డ బయ్యారం.. ఏజెన్సీ అభివృద్ధిని మరిచిన పాలకులు
X

దిశ, బయ్యారం : నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమంలో అన్నివర్గాల ప్రజలు ముందుండి పోరాటం చేశారు. పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్​ రెండు సార్లు అధికారం చేపట్టినా ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.

ఉమ్మడిరాష్ట్రంలో బయ్యారం చెరువుకు నిధులు..

ఉమ్మడి రాష్ట్రంలో 1997లో టీడీపీ హయాంలో తుమ్మల నాగేశ్వ ర్ రావు మంత్రిగా ఉన్న సమయంలో బయ్యారం చెరువును మీడియం ఇరిగేషన్ గా గుర్తించారు. ఆ నాడు ఇల్లందు నియోజకవర్గంలో న్యూడెమోక్రసీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఉన్నారు. బయ్యారం చెరువుకు అప్పటి సీఎం వైఎస్​రాజశేఖర్ రెడ్డి 2005, 2006 సంవత్సరాల్లో రూ.13 కోట్ల నిధులు మంజూరు చేశారు. నాడు సుమారు రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి. మిగిలిన రూ.3 కోట్ల నిధులతో బయ్యారం చెరువు ప్రధాన కాల్వల మరమ్మతులు చేయడం మరిచారు. స్వరాష్ట్రం ఏర్పడి 9ఏళ్లు దాటినా బయ్యారం చెరువుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు చేయలేదు.

నీళ్లు, నిధులు, నియామకాల జాడెక్కడ ?

నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నీటి జాడెక్కడా అని బయ్యారం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండు సార్లు అధికారంలో వచ్చినా కాకతీయుల కాలం నాటి బయ్యారం చెరువు అభివృద్ధిని మరిచారని మండిపడుతున్నారు. మండలంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 7500 హెక్టార్లకు బయ్యారం చెరువు కల్పతరువుగా మారింది. స్వరాష్ట్రంలో పాలకులు చెరువు అభివృద్ధికి నయా పైసా ఖర్చు చేయక పోవడంతో స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ బయ్యారం చెరువు అభివృద్ధి మాటలు నీటి మూటలుగానే మిగిలాయని రైతులు మండిపడుతున్నారు.

సీతారామ ప్రాజెక్టు ఎత్తి పోతల పథకం కోసం ఇల్లందు నుంచి ఉమ్మడి ఖమ్మం పాలేరు వరకు కాల్వల నిర్మాణాలు జరగడం గమర్హం. సీతారామ ప్రాజెక్టు బయ్యారం చెరువుకు అనుసంధానం జరిగితే గతంలో ఉన్న బయ్యారం చెరువు ట్యాంకు 1.5 టీఎస్ నుంచి 2.5టీఎస్​ల సామార్థ్యం చేయాల్సి ఉంటుంది. దీంతో రైతులకు రెండు పంటలకు నీరందించి సస్యశ్యామలం చేయవచ్చనే ఆలోచన పాలకుల్లో లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాకతీయులనాటి చెరువు

బయ్యారం చెరువు కాకాతీయుల కాలం నాటిది. స్వాతంత్ర్యం రాక ముందు బతకలేని వాడు బయ్యారం పోయి బతుకవచ్చు అనే నానుడి ఉంది. ఎక్కడ వర్షాలు కురియకున్నా బయ్యారం ఏజెన్సీలో వర్షాలు కురిసి చెరువు నిండి పంటలు పండేవి. కానీ నేడు పోడు సాగుతో అకాల వర్షాలకు వరద నీటితో చెరువు మట్టితో పూడుకుపోయింది. బయ్యారం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు చేయడంతో మిషన్ కాకాతీయ పనుల్లో చోటు దక్క లేదు.

నాయకుల మాటలు నీటి మూటలే ..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రెండు సార్లు అసెంబ్లీ, పార్ల మెంటు ఎన్నికలు జరిగాయి. 2014లో ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి కోరం కనుకయ్య గెలుపొందారు. మహబూబాబాద్ పార్లమెంట్​నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాంనాయక్ గెలుపొందారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు కోరం కనుకయ్య, బానోత్ హరిప్రియ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని చెప్పి బయ్యారం అభివృద్ధిని మరిచారని ప్రజలు మండిపడుతున్నారు. 2019లో ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బానోత్ హరిప్రియ గెలుపొందారు. మహబూబాబాద్ పార్లమెంటు నుంచి మాలోత్ కవిత టీఆర్ ఎస్ అభ్యర్థిగా గెలు పొందారు. నేటికీ బయ్యారం మండల ప్రజల ఆకాంక్ష నేర వేరలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Next Story