అన్నదాతలు అధైర్య పడొద్దు... అండగా ఉంటాం: ఎమ్మెల్యే రాములు నాయక్

by Dishanational1 |
అన్నదాతలు అధైర్య పడొద్దు... అండగా ఉంటాం: ఎమ్మెల్యే రాములు నాయక్
X

దిశ, వైరా: "అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దు... ప్రభుత్వంతోపాటు తాను అన్నదాతలకు అండగా ఉంటాం... నష్టపోయిన పంట వివరాలను అంచనా వేస్తున్నాం... పంట నష్ట వివరాల నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతాం... పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకునేందుకు కృషి చేస్తామని" వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ స్పష్టమైన హామీ ఇచ్చారు. వైరా మండలంలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన అకాల వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. వర్షం వల్ల మొక్కజొన్న పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లిన విషయమై గురువారం రాత్రి దిశ వెబ్ సైట్ లో "అకాల వర్షంతో అన్నదాత ఆగం" అనే వార్త కథనం ప్రచురితమైంది.

ఈ వార్త కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ పంట నష్ట వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. దీంతో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తో కలిసి మండలంలోని ఖానాపురం గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటను శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ పంట నష్టపోయిన రైతుతో మాట్లాడారు. తాను ఆరుకాలం కష్టం చేసి, శ్రమించి పండించిన పంట వర్షానికి దెబ్బతిందని రైతు ఎస్ కే రఫీ తన ఆవేదనను ఎమ్మెల్యే కు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ అకాల వర్షం వల్ల మండలంలో నష్టపోయిన పంటల వివరాలను వ్యవసాయ అధికారులు అడిగి తెలుసుకున్నారు. వైరా మండలంలో ప్రస్తుత యాసంగిలో 2866 ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. గురువారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షాలకు సుమారు 1500 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకూలి దెబ్బతిందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ అకాల వర్షం వల్ల మొక్కజొన్న పంట దెబ్బ తినటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులెవరూ అధైర్యపదవద్దని, ప్రభుత్వంతోపాటు తాను అన్నదాతలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వ్యవసాయ అధికారులు నష్టపోయిన పంట వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తున్నారని చెప్పారు. అధికారులు వివరాల సేకరణ పూర్తయిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే సీఎంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రితో తానే స్వయంగా మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైరా ఏడీఏ వి.బాబురావు, మండల వ్యవసాయ అధికారి ఎస్. పవన్ కుమార్, వైరా జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed