‘బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లాలి’: కేఎంసీ కమిషనర్

by Kodari Anjali |

సర్-2026 మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం విడనాడాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు.

‘బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లాలి’: కేఎంసీ కమిషనర్
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్: సర్- 2026 మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం విడనాడాలని ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పేర్కొన్నారు బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ -2026) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై ఏఈఆర్వోలు, సూపర్వైజర్ అధికారులు, సంబంధిత సిబ్బందితో కమిషనర్ శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఏఈఆర్వో పరిధిలో ఇప్పటివరకు పూర్తయిన మ్యాపింగ్ శాతం, పెండింగ్‌లో ఉన్న మ్యాపింగ్ వివరాలు, పనుల పురోగతి మందగించిన ప్రాంతాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి మ్యాపింగ్ నిర్వహిస్తున్నారా, వారికి కేటాయించిన మొత్తం మ్యాపింగ్‌ల సంఖ్య, పూర్తయినవి, పెండింగ్‌లో ఉన్నవి వంటి వివరాలను వ్యక్తిగతంగా కమిషనర్ సమీక్షించారు.

ఓటర్ల వివరాలను అధికారుల వారీగా..

బీఎల్‌వోలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించిన నేపథ్యంలో అధిక మ్యాపింగ్ భారం ఉన్న బీఎల్‌వోలకు అవసరమైన సహాయక సిబ్బందిని కేటాయించారా లేదా అనే అంశంపై అధికారులను ప్రశ్నించారు. అలాగే బీ ఎల్ వో లకు అందుబాటులో ఉన్న అసిస్టెంట్ల సంఖ్య, వారి సేవల వినియోగంపై కూడా వివరాలు తెలుసుకున్నారు. హౌస్ షిఫ్ట్ అయిన ఓటర్ల మ్యాపింగ్‌ను నిబంధనల ప్రకారం ఎలా నిర్వహించాలి. వారి వివరాలను ఏ విధంగా నమోదు చేయాలి అనే అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రతి ఏఈఆర్వో పరిధిలో ఉన్న మొత్తం మ్యాపింగ్ లక్ష్యాలు, పూర్తయిన పనులు, ఇంకా మ్యాపింగ్ కాకుండా మిగిలి ఉన్న గృహాలు, ఓటర్ల వివరాలను అధికారుల వారీగా సమీక్షించారు. మ్యాపింగ్ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా బీ ఎల్ వో లు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి విధులు నిర్వహించాలని, పెండింగ్ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. సర్ -2026 కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.

Next Story