తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి అద్భుతం: మంత్రి పువ్వాడ అజయ్

by Disha Web Desk 12 |
తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి అద్భుతం: మంత్రి పువ్వాడ అజయ్
X

దిశ బ్యూరో, ఖమ్మం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా కొనసాగుతుందని, దేశంలోనే తెలంగాణ ప్రత్యేక స్థానం కైవసం చేసుకుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం ఐటి హబ్ లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వీడీఓస్ క్యాంపు కార్యాలయం నుంచి ఐటీ హబ్ వరకు మోటార్ సైకిల్ పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ హబ్‌లో ఎర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలంగాణ పరిశ్రమలకు నీళ్లు, కరెంటు లేక పరిశ్రమలు మూసేసిన రోజుల నుంచి నేడు అనేక రంగాల్లో సామాన్యులు సైతం పరిశ్రమలు నెలకొల్పి విజయవంతం అయ్యారని అన్నారు.

నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారికి నేడు 24 గంటలు పరిశ్రమ నడిపే విధంగా అన్ని సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజులలో అన్ని అనుమతులు లభించే విధంగా పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి రూపొందించారని పేర్కొన్నారు. 9 ఏళ్లలో 23 వేలకు పైగా కొత్త పరిశ్రమలు, 17 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. గ్రానైట్ పరిశ్రమను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు రోజు రోజుకీ క్రేజీ పెరుగుతోందని, రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇంతింతై పెరుగుతూ ఇప్పటివరకు 2.6 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. దీంతో తెలంగాణలో ప్రైవేటు రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తృతమయ్యాయని, ఇదే విషయాన్ని తాజాగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎగుమతుల ప్రోత్సాహక మండలి(ఎంఎస్‌ఎంఈ) నివేదిక వెల్లడించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నాయకత్వంలో తెలంగాణకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని పారిశ్రామిక విధానం తీరును మరోసారి జాతీయ స్థాయిలో ఎలుగెత్తి చాటిందన్నారు.

ప్రగతి పథంలో వ్యవసాయ, అనుబంధ రంగాలతోపాటు, ఐటీ రంగం అద్భుతంగా పురోగమిస్తున్నదని, ఈ ఏడాది 17.53 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు చెప్పారు. పారదర్శక విధానాలు సుస్థిర ప్రగతి, విధానాల అమలులో వేగం, పాలనలో మరింత వేగం వంటివి పెట్టుబడులకు ఊతంగా నిలుస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని వివరించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ గారి సారధ్యంలో రోజుకో రికార్డును సొంతం చేసుకుంటున్నదని, పెట్టుబడుల సాధన, పరిశ్రమల వ్యవస్థాపన, ఉపాధి కల్పనలో జెట్‌ వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేశారు. అనంతరం ఉత్తమ పారిశ్రామిక వేత్తలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు ఇచ్చి సత్కరించారు.

కలెక్టరేట్ లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఖమ్మం జిల్లా సమీకృత కార్యాలయం నందు రూ.17 లక్షలతో నిర్మించిన సెక్యూరిటీ రూమ్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో రూ.1 కోటి 78 వేలతో నిర్మించనున్న పార్కింగ్ షెడ్ తో పాటు ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న 100 కిలో వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, మేయర్ పునుకొల్లు నీరజ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఎమ్మెల్యే రాములు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, పరిశ్రమల శాఖ జీఎం అజయ్ కుమార్, వివిధ కంపెనీల సీఈఓ లు అధికారులు ఉన్నారు.


Next Story

Most Viewed