జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాది

by Disha Web Desk 1 |
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాది
X

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ హామీ

దిశ, వైరా: వైరాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదేనని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైరాలో జర్నలిస్టులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష మంగళవారం ఆరో రోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని మంగళవారం ఎమ్మెల్యే రాములు నాయక్ సందర్శించారు. అనంతరం ఆయన జర్నలిస్టుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము ఇళ్ల స్థలాల కోసం తొమ్మిదేళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నామని జర్నలిస్ట్ ప్రతినిధులు ఎమ్మెల్యేకు వివరించారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు పోరాటాన్ని ఆపబోమని జర్నలిస్టులు ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. వెంటనే తహసీల్దార్ అరుణను పిలిపించి వైరాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను ఎమ్మెల్యే రాములు నాయక్ అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను జర్నలిస్టు ప్రతినిధులకు చూపించాలని తహసీల్దార్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. వైరాలో అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను జర్నలిస్టు ప్రతినిధులు పరిశీలించారు. న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల సమీపంలో ప్రభుత్వ భూమి తమకు ఇళ్ల స్థలాల కోసం అనుకూలంగా ఉంటుందని జర్నలిస్టులు ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఆ భూమిని జర్నలిస్టులకు కేటాయిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. బుధవారం ఆ స్థలంలో జర్నలిస్టుల పేరుతో బోర్డును ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. స్థలాల కేటాయింపు ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టు మిత్రులందరూ తన కుటుంబ సభ్యులేనని తెలిపారు. జర్నలిస్టులకు స్థలం కేటాయించడంతో పాటు డబుల్ బెడ్ రూమ్ స్కీం కింద ఇల్లు నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు జర్నలిస్టులు సమన్వయం పాటించాలని కోరారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ కోసం స్థలాన్ని కేటాయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ జర్నలిస్టులకు నిమ్మరసం అందించి రిలే దీక్షలను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్, బీఆర్ఎస్ నాయకులు కాపా మురళీకృష్ణ, వనమా విశ్వేశ్వరరావు, కట్టా కృష్ణార్జునరావు, పసుపులేటి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed