బరిలో ఎవరు.. బలయ్యేదెవరు..? కాంగ్రెస్‌లో పొంగులేటి ఎంట్రీ ప్రచారంతో హై టెన్షన్

by Disha Web Desk 9 |
బరిలో ఎవరు.. బలయ్యేదెవరు..? కాంగ్రెస్‌లో పొంగులేటి ఎంట్రీ ప్రచారంతో హై టెన్షన్
X

దిశ, వైరా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీ మార్పుపై రోజుకో ప్రచారం జరుగుతున్నది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం తథ్యమని విస్తృత ప్రచారం జరుగుతున్నది. దీంతో పొంగులేటి ప్రకటించిన అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాంగ్రెస్ లో చేరితే అన్ని స్థానాలను ఆయనకు కేటాయించే అవకాశం ఉండకపోవచ్చు. మధిర, భద్రాచలం టికెట్ పొంగులేటి వర్గీయులకు లభించదని స్పష్టమవుతుంది. మిగిలిన 8స్థానాల్లో ఉన్న ఆశావహుల్లో హై టెన్షన్ నెలకొన్నది. ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనతో పొంగులేటికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ఆశావహులు వీరే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే నూటికి నూరు శాతం టికెట్ కేటాయిస్తుంది. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాల్లో టికెట్ కోసం రేవంత్‌రెడ్డి, రేణుకా చౌదరి, మల్లు భట్టి విక్రమార్క వర్గీయులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. పాలేరులో పోటీ చేసేందుకు రాయల నాగేశ్వరరావు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇటీవల ఖమ్మం అసెంబ్లీలో తాను పోటీ చేస్తానని రేణుకా చౌదరి స్వయంగా ప్రకటించారు. వైరాలో టికెట్ కోసం మాలోత్ రాందాస్ నాయక్, ధరావత్ రామ్మూర్తి నాయక్, బానోత్ బాలాజీ నాయక్, ఇల్లెందులో చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవి, భూక్య రామచంద్రనాయక్, దళసింగ్ పొరిక బలరాం నాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

సత్తుపల్లిలో మానవతారాయ్, సంబాని చంద్రశేఖర్, మట్టా దయానంద్, దయానంద్‌కు టికెట్ ఇవ్వలేని పక్షంలో ఆయన భార్య రాగమయి, పినపాక నియోజకవర్గంలో భట్టా విజయ గాంధీ, పోలెబోయిన శ్రీవాణి, ధనసరి సూర్య, కాటబోయిన నాగేశ్వరరావు, చందా సంతోష్ కుమార్ కొత్తగూడెంలో యడవల్లి కృష్ణ, పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు అశ్వరావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయా నియోజకవర్గాల్లో టికెట్ కోసం మరింత పోటీ నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

పొంగులేటి అభ్యర్థులు వీరే

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గాల స్థాయి ఆత్మీయ సమ్మేళనాల్లో తన వర్గం నుంచి అభ్యర్థులను ప్రకటించారు. మధిర నుంచి కోటా రాంబాబు, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావులను ప్రకటించారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే ఈ ఇరువురి అభ్యర్థులకు టికెట్ వచ్చే అవకాశం ఉండదు. వైరా నుంచి బానోత్ విజయబాయి, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, సత్తుపల్లి నుంచి కొండూరు సుధాకర్, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణల పేర్లను ప్రకటించారు. ఖమ్మం నుంచి పొంగులేటి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది.

కొత్తగూడెం నుంచి తన అభ్యర్థిగా ఊకంటి గోపాలరావును నిలిపేందుకు గతంలో పొంగులేటి ప్రయత్నాలు చేశారు. పొంగులేటి తరుపున వైరా నుంచి పోటీ చేసేందుకు బానోత్ విజయభాయి సీపీఐ నుంచి ఆయన వర్గంలో చేరింది. సత్తుపల్లి నుంచి పోటీ చేసేందుకు కొండూరు సుధాకర్ పంచాయతీరాజ్ శాఖలోని ఈఈ ఉద్యోగానికి స్వతంత్రంగా పదవి విరమణ చేశారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే 8 నియోజకవర్గాల్లో మొత్తం టికెట్లను పొంగులేటి వర్గీలకు కేటాయించే అవకాశం ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ రాజకీయ క్రీడలో కాంగ్రెస్ ఆశావహులతో పాటు పొంగులేటి అభ్యర్థులు సైతం కొంతమంది బలవ్వక తప్పదనే అభిప్రాయాలు సర్వత్ర వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed