దర్జాగా విద్యుత్ చౌర్యం .. పట్టించుకోని అధికారులు

by Dishanational2 |
దర్జాగా విద్యుత్ చౌర్యం .. పట్టించుకోని అధికారులు
X

దిశ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో విద్యుత్ చౌర్యం రోజురోజుకూ పెరిగిపోతున్నది. దొరికితే దొంగ.. లేకుంటే దొర అనే చందంగా ఉంది ఎన్పీడీసీఎల్‌లో పరిస్థితి. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టండి అని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు మాత్రం పెడచెవి పెడుతున్నారు. జిల్లాలో నామామాత్రంగా దాడులు చేస్తూ విద్యుత్ చౌర్యం అరికట్టడంలో విఫలం అవుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని డీఈ పరిధిలోని సత్తుపల్లి, ఖమ్మం (టౌన్), వైరా, ఖమ్మం (రూరల్), ప్రాంతంలో విద్యుత్ చౌర్యం విచ్చలవిడిగా జరుగుతున్నది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సబ్ డివిజన్‌లో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది నిర్లక్ష్యంతో కారణంగానే ఇలా జరుగుతున్నదని ఆశాఖ సిబ్బంది బహిరంగ చెబుతుండటం గమనార్హం. ప్రతి నెల ఎంతో కొంత మాట్లాడుకొని రాత్రి వేళల్లో అక్రమంగా విద్యుత్ తీగలకు లింకులు తగిలించి విద్యుత్ సరఫరాను చేస్తున్నారని సమాచారం.

పెరిగిన డిమాండ్..

ఖమ్మం జిల్లాలోని 6,68,776ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 4,85,726 గృహ వినియోగం, 58,003 వాణిజ్యపరమైనవి, 3679 పరిశ్రమలకు, 416 కుటిర పరిశ్రమలకు, 1,08,520వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. దీంతోపాటు 7,265వీధి దీపాలు, 531తాత్కాలిక అవసరాలకు వినియోగించేందుకు తీసుకునే విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్‌శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా కొందరు పలు అవసరాలకు అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతుండటం ఇటీవల కాలంలో అధికమైంది. కొందరు విద్యుత్‌ మీటర్లను టాంపరింగ్‌ చేస్తున్నారు. మరికొందరు విద్యుత్‌శాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే అధిక మొత్తంలో కరెంటును వినియోగిస్తున్నారు. ఇలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు విద్యుత్‌ శాఖలో ప్రత్యేకంగా విజిలెన్స్‌ టీం ఉంది. ఈ టీం సభ్యులు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్‌ను అక్రమంగా వినియోగించే వారిని గుర్తించి వారి పై కేసులు నమోదు చేస్తున్నారు. అయిన విద్యుత్ చౌర్యం పై పూర్తి స్థాయిలో కట్టడి చేయడం లేదని విమర్శలు వినపడుతున్నాయి

బహిరంగంగానే చౌర్యం..

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 8వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలకు వైర్లకు లింకులు పెట్టి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఖమ్మం డీఈ కార్యాలయం కూతవేటు దూరంలోనే ఈతతంగం నడుస్తుందంటే జిల్లాలో విద్యుత్ అధికారుల పనితీరు ఎలా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డివిజన్లలో విద్యుత్ అధికారులు, సిబ్బంది తిరుగుతున్నా అక్కడ ఉన్న పరిస్థితిపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పనిచేస్తున్న సంస్థలో నష్టం వాటిల్లుతున్నా అధికారులు విద్యుత్ చౌర్యం పై దృష్టి సారించకపోవడం పలు అనుమానాలు వస్తున్నాయి.


Next Story

Most Viewed