విజయోత్సవం వేళ.. వైరాను వెక్కిరిస్తున్న విద్యుత్ సమస్యలు

by Disha Web Desk 12 |
విజయోత్సవం వేళ.. వైరాను వెక్కిరిస్తున్న విద్యుత్ సమస్యలు
X

దిశ, వైరా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైరాలో సోమవారం విద్యుత్ విజయోత్సవం నిర్వహించేందుకు విద్యుత్ శాఖ సంసిద్ధమైంది. అయితే వైరా పట్టణంలో కుప్పలు తెప్పలుగా ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించని విద్యుత్ శాఖ అధికారులు విజయోత్సవాలు చేయడంపై స్థానిక వినియోగదారులు మండిపడుతున్నారు. విజయోత్సవం దేవుడు ఎరుగు సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు సీఎండీ సారూ అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో నెలకొన్న సమస్యలు ఏండ్లుగా పరిష్కారం కావడం లేదు. అధికారులు చూద్దాం.... చేద్దాం అనే భావనలో ఉన్నారు తప్ప పరిష్కరించేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ముందు ఇక్కడి సమస్యలను పరిష్కరించి తర్వాతే విద్యుత్ విజయోత్సవం నిర్వహించాలంటున్నారు.

మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన వైరాలో పలు ప్రాంతాల్లో నేటి వరకు సింగిల్ ఫేస్ విద్యుత్తు లైన్లను త్రి ఫేస్ విద్యుత్తు లైను‌గా అభివృద్ధి చేయలేదు. అంతేకాకుండా ఇక్కడి తొమ్మిది ప్రాంతాల్లో ఇంకా సింగిల్ ఫేస్ విద్యుత్ ట్రాన్స్ పార్మర్లనే కొనసాగిస్తున్నారు. దీంతో వైరాలోని బోడేపూడి కాలనీ, బంకు కాలనీ, తల్లాడ రోడ్డు లోని వే బ్రిడ్జి కాలనీ, ఇందిరమ్మ కాలనీ, హనుమాన్ బజార్, లీలా సుందరయ్య నగర్ లోని కొంత భాగం, శాంతినగర్ ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలను లోవోల్టేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వైరా లోని బోడిపూడి కాలనీలో మూడు, తల్లాడ రోడ్డు లోని వే బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో రెండు, ఇందిరమ్మ కాలనీలో రెండు, ఫిష్ రేస్ కాలనీలో ఒకటి, అమ్మ రెస్టారెంట్ వెనుక భాగంలో ఒక సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయటంతో నిరంతరం లో వోల్టేజ్ సమస్య ఏర్పడుతుంది. పలు ప్రాంతాల్లో సింగిల్ ఫేస్‌ను త్రీఫేస్ లైనుగా అభివృద్ధి చేయకపోవడంతో ఒకే ఫేస్ పై లోడ్ పడి విద్యుత్ సమస్యలు వస్తున్నాయి.

వైరా పట్టణంలో సుమారు వంద లోపు విద్యుత్ ట్రాన్స్‌‌ఫార్మర్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 15ట్రాన్స్‌‌ఫార్మర్లకు మాత్రమే ఏబీ స్విచ్లు ఉన్నాయి. మిగిలిన వాటికి లేవు. దీంతో ఏ ట్రాన్స్‌‌ఫార్మర్ ఫీజు పోయినా వైరా పట్టణం మొత్తం ఎల్సీ తీసుకుని విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. దీంతో టీఎస్ ఎన్పీడీసీఎల్‌కు ఫీడర్ల వద్ద విద్యుత్ ఆఫ్ చేసి ఆన్ చేయడం తో విద్యుత్ లాస్ అవుతుంది. నిరంతరం ట్రాన్స్‌‌ఫార్మర్ ఫీజులు వేసేందుకు వైరా పట్టణం మొత్తం కరెంటు పోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధిర రోడ్డులోని టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ కళాశాల నుంచి మధిర రింగ్ రోడ్డు వరకు, శ్రీనివాస థియేటర్ వద్ద నుంచి వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భాగం వరకు రెండేళ్ల క్రితం 11 కేవీ వైరు లాగారు. వైరును నేటి వరకు ఖాళీగా ఉంచారు. దీంతో వైరాలో విద్యుత్ సమస్యలు తీరకపోగా ఎన్పీడీసీఎల్ కు వైరు నిరుపయోగంగా ఉండటంతో ఆర్థిక నష్టం నెలకొంది.

ఇందిరమ్మ కాలనీలో ఇళ్లపై నుంచి వెళ్తున్న 11 కేవీ వైర్ ను తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిరంతరం వైరా పట్టణంలో విద్యుత్ ట్రిప్పు కావడంతో పాటు ఫీజులు వేసేందుకు ఏబీసీచ్చులు లేకపోవడంతో సిబ్బంది తీసుకుంటున్న ఎల్సీలు వివరాలు ఆపరేటర్లు రికార్డులో పూర్తిస్థాయిలో పొందుపరచడం లేదు. నిరంతరం ఆపరేటర్లు రికార్డుల్లో విద్యుత్ ట్రిప్పు, ఎల్సీల వివరాలు పొందుపరిస్తే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అధికారులకు అర్థమవుతుంది. విద్యుత్ లైన్ల ప్రతిపాదనల కోసం కూడా ఇక్కడ అధికారులు వినియోగదారులను నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇలా వైరా పట్టణంలో విద్యుత్ సమస్యలు చెప్పకుంటూ పోతే చాంతాడంత అవుతాయి. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.


Next Story