బుట్ట దాఖలైన ట్రైనీ కలెక్టర్ నివేదిక..?

by Disha Web Desk 20 |
బుట్ట దాఖలైన ట్రైనీ కలెక్టర్ నివేదిక..?
X

దిశ, వైరా : వైరాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బరితెగించారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని డీటీసీపీ అనుమతి లేకుండానే వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పటికే సుమారు కోటిన్నర రూపాయలకు 25 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న కోర్టు వివాదం గతంలో దిశ కథనాలతో బహిర్గతం కావడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ మోసం బహిర్గతమైనది. దీంతో ఆ వెంచర్లో 25 ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.

కోర్టు వివాదంలో ఉన్న భూమిని తమకు విక్రయించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారని ఒక్కో కొనుగోలుదారుడు తమ ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. ప్రస్తుతం ఆ ప్లాట్లను విక్రయించే వీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఆ రియల్ చీటింగ్ వ్యాపారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా గత నాలుగు నెలలుగా అధికారులు మాత్రం తమకేం తెలవదు అన్నట్లు నటిస్తున్నారు. అధికారుల తీరు "నవ్విపోదురు కాకే....మాకేటి సిగ్గు" అన్న చందంగా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఇది వైరాలోని రియల్ వ్యాపారి ప్లాట్ల కొనుగోలుదారులను చేసిన పచ్చి మోసం. కోర్టు వివాదంలో ఉన్న భూమిని డీటీసీపీ అనుమతి లేకుండా వెంచర్ వేసిన విషయం బహిర్గతమై 4 నెలలు గడుస్తున్నా ఆ వ్యాపారిపై నేటి వరకు కనీస చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు దారితీస్తుంది. ఈ వ్యవహారంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. 4 నెలల క్రితం ఈ వెంచర్ లో మున్సిపాలిటీ అధికారులు తొలగించిన ప్లాట్లు సరిహద్దు తెలిపే రాళ్ళను తిరిగి ఏర్పాటు చేయడం విశేషం.

కోర్టు వివాద భూమి వివరాలు ఇవే...

కొణిజర్ల మండలంలోని దిద్దుపూడి రెవెన్యూ పరిధిలో న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల వెనుక భాగంలో సర్వేనెంబర్ 49 లో గోరంట్ల నాగేశ్వరావు అనే వ్యక్తి పేరు పై మూడు ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంపై నాగేశ్వరావు బంధువులు కోర్టులో కేసు వేశారు. దీంతో కోర్టు ఈ పొలం పై స్టే ఆర్డర్ విధించింది. కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని వైరాకు చెందిన రియల్ వ్యాపారి ఓ ఆదినారాయనుడు 2021 వ సంవత్సరంలో కొనుగోలు చేసి డీటీసీపీ అనుమతి లేకుండా వెంచర్ వేశాడు. ఈ వెంచర్ లోని సుమారు 25 ప్లాట్లను మధ్యతరగతి ప్రజలకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కోర్టు వివాదంలో ఈ భూమి ఉన్న విషయం బహిర్గతం కావడంతో ప్లాట్లు కొన్న వాళ్లు తిరిగి అమ్మేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఆ ఫ్లాట్లు కొన్న మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

మోసానికి పాల్పడిన రియల్ వ్యాపారి పై కనీస చర్యలు శూన్యం....

కోర్టు వివాదంలో ఉన్న భూమిని డీటీసీపీ అనుమతి లేకుండా వెంచర్ వేసి మధ్యతరగతి ప్రజలను మోసం చేసిన సదరు రియల్ వ్యాపారి పై నేటి వరకు కనీస చర్యలు తీసుకోలేదు. సుమారు 25 మందికి కోర్టు వివాద భూమిని కోటిన్నర రూపాయలకు విక్రయించి అందిన కాడికి మోసం చేశారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన వారి ప్లాట్లను విక్రయించేందుకు వీల్లేకుండా పోయింది. అంతేకాకుండా గతంలో కొనుగోలుదారుల పేర్ల పై రియల్ వ్యాపారి చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు హోల్డ్ లో పెట్టారు.

ప్రస్తుతం ఆ హోల్డ్ ను తీసివేయించేందుకు రియల్ వ్యాపారి శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో కొనుగోలుదారులు తీవ్ర మనోవేద చెందుతున్నారు. మూడు నెలల క్రితం మున్సిపాలిటీ అధికారులు ఈ అక్రమ వెంచర్ లోని రాళ్లను తొలగించారు. అధికారులు తొలగించిన మరునాడే సదరు రియల్ వ్యాపారి మరలా ప్లాట్ల సరిహద్దు తెలుపుతూ రాళ్ళను ఏర్పాటు చేశాడు. ఈ రాళ్లని ఏర్పాటు చేయించడంలో స్థానికంగా కొంతమంది ప్రజాప్రతినిధుల హస్తముందని వైరాలో బహిరంగ ప్రచారమే జరుగుతుంది. అయితే నేటికీ ఆ రాళ్లను తొలగించకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రైనీ కలెక్టర్ నివేదిక బుట్ట దాఖలయ్యిందా..

దిశ దినపత్రికలో వచ్చిన అనేక వార్త కథనాలతో నాలుగు నెలల క్రితం వైరాలో అప్పుడు పని చేసిన ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా ఈ వెంచర్ అక్రమాలపై విచారణ నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులు సమర్పించారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని డిటిసిపి అనుమతి లేకుండా మున్సిపాలిటీలో వెంచర్ గా మార్చారని అప్పట్లో ఆమె జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించారు. అప్పట్లో హడావుడిగా ఫ్లాట్ల సరిహద్దు రాళ్ళను తొలగించారు. అయితే వెంటనే అధికారులకు సవాల్ చేస్తూ మరలా రాళ్లను రియల్ వ్యాపారి పాతాడు. అప్పటినుంచి ఇప్పటివరకు సదరు రియల్ వ్యాపారిపై అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంతో ట్రైనీ కలెక్టర్ నివేదిక బుట్ట దాఖలైందని స్థానికంగా విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రియల్ మోసానికి పాల్పడిన వ్యాపారి పై చర్యలు తీసుకుంటారో...? లేదో....? వేచి చూడాల్సిందే



Next Story