ఏదులాపురం చెరువు తూము ధ్వంసం

by Kodari Anjali |

ఎదులాపురం మున్సిపాలిటీకి ప్రధాన జీవనాధారంగా ఉన్న ఎదులాపురం చెరువు శనివారం తెల్లవారుజామున మరోసారి దుండగుల చర్యలకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.

ఏదులాపురం చెరువు తూము ధ్వంసం
X

దిశ, ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీకి ప్రధాన జీవనాధారంగా ఉన్న ఎదులాపురం చెరువు శనివారం తెల్లవారుజామున మరోసారి దుండగుల చర్యలకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు చెరువు తూమును ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో నిండుగా నిల్వ ఉన్న నీరు పెద్ద ఎత్తున వృథాగా వెళ్లిపోగా, మున్సిపాలిటీ ప్రజల అవసరాలకు కీలకమైన నీటి నిల్వలకు గండిపడింది.ఈ చెరువు కేవలం సాగునీటి వనరు మాత్రమే కాకుండా స్థానిక తాగునీటి అవసరాలకు, రక్షిత మంచినీటి పథకానికి కూడా ఆధారంగా ఉండటంతో ఘటన తీవ్రత మరింత పెరిగింది.

ప్రజా వనరులపై దాడులు జరుగుతున్నా..

నీటి వృథాతో భవిష్యత్తులో సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని నీటి ప్రవాహాన్ని నియంత్రించే చర్యలు చేపట్టినట్లు తెలిసింది. అయితే ఇక్కడే ప్రజల ప్రశ్న మొదలవుతోంది. పదేపదే ఇదే చెరువు తూము ధ్వంసానికి గురవుతుంటే ఇప్పటివరకు బాధ్యులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? భద్రతా చర్యలు ఎందుకు బలోపేతం కాలేదు?ప్రజల అవసరాలకు కీలకమైన ప్రజా వనరులపై దాడులు జరుగుతున్నా, దోషులను గుర్తించడంలో నిర్లక్ష్యం కొనసాగితే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిరక్షణ, నిరంతర పర్యవేక్షణ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story