ఆ భూముల్లో గంజాయి సాగుచేస్తే పీడీ యాక్ట్.. DSP వార్నింగ్

by Web Desk |
ఆ భూముల్లో గంజాయి సాగుచేస్తే  పీడీ యాక్ట్.. DSP వార్నింగ్
X

దిశ, చండ్రుగొండ: రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారని కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర బాబు అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం లక్ష్య గార్డెన్‌లో అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ మండలాల సర్పంచులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర బాబు మాట్లాడుతూ.. గ్రామాల్లో యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడి చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని సూచించారు. గ్రామంలో మాదకద్రవ్యాలను అరికట్టి యువతను చెడు దారిలో పయనించకుండా చూడటంలో సర్పంచులదే కీలక బాధ్యత అన్నారు. మాదకద్రవ్యాలు రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీస్ శాఖకు అందించాలని కోరారు.

ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా, సాగుచేస్తున్నా వారిపై తక్షణమే పీడీ నమోదు చేస్తామని హెచ్చరించారు. పోడు భూముల్లో ఎవరైనా గంజాయి సాగు చేసినట్లు తెలిస్తే, వారి భూమికి సంబంధించిన హక్కు పత్రాలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సర్పంచులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామాల్లో బెల్టుషాపులు అధికంగా ఉండటం మూలంగా యువత చెడు అలవాట్లకు బానిస అయ్యి, అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. వెంటనే గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను తొలగించాలని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగరాజు, ఎస్ఐలు రాజేష్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Next Story