Deputy CM : వచ్చే నెల 6 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే

by Sridhar Babu |

వచ్చే నెల 6 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే (Comprehensive household survey)నిర్వహించనున్నట్టు, దీనిని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)అన్నారు.

Deputy CM : వచ్చే నెల 6 నుంచి సమగ్ర ఇంటింటి  సర్వే
X

దిశ మధిర : వచ్చే నెల 6 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే (Comprehensive household survey)నిర్వహించనున్నట్టు, దీనిని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)అన్నారు. మంగళవారం ఆయన మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి కుటుంబ సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తయారు చేసిన ప్రణాళిక, సర్వే ఉద్దేశం, జిల్లా స్థాయిలో కలెక్టర్ లు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే నిర్వహణ విధి విధానాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించామని తెలిపారు.

ఇది ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడానికి దోహదపడుతుందన్నారు. అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ లను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ అందించాలని కోరారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ఉండేలా ఈబీ మ్యాప్ లను అప్ డేట్ చేయాలని సూచించారు. 10 ఈబీ బ్లాక్ లకు ఒక సూపర్వైజర్ ఉండాలని, వీరు 10 శాతం ఇండ్లను ర్యాండంగా ఎంచుకొని డేటా వివరాలు తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. సర్వే నిర్వహణకు అవసరమైన ఫారంలు, మార్గదర్శకాలు, ముద్రణ, స్టేషనరీ ఏర్పాట్లు చేయాలన్నారు. నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభించాలని, సర్వే చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ధరణి పాస్ పుస్తకాలు కుటుంబం దగ్గర ఉంచుకునేలా ప్రచారం చేయాలని అన్నారు. ఈ డేటా ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదన్నారు.

రోజువారి సర్వే పురోగతిని జిల్లా వారీగా ఏ రోజుకారోజు సాయంత్రం 6 గంటలకు తెలియజేయాలని పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి పాల్గొన్నరాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ చరిత్రలో నిలిచిపోయే ప్రక్రియ అవుతుందని అన్నారు. తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సర్వే నిర్వహణ షెడ్యూల్ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. సర్వే పూర్తి చేసిన ఇంటికి స్టిక్కర్ అంటించాలని అన్నారు.

సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ల బాధ్యతలు స్పష్టంగా తెలియజేశామని, ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ కుటుంబాల ఆదాయ వివరాలు నమోదు అంశంలో ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ అవసరమవుతుందా, కుల వివరాలు సేకరణ సమయంలో బీసీ-సీ వర్గాలకు చెందినవారు ఎస్సీలుగా తెలిపితే ఎలా నమోదు చేయాలి మొదలైన సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.

ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్షిస్తూ...

జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో వచ్చే ధాన్యం దిగుబడి, అందుబాటులో ఉన్న గోడౌన్ సామర్థ్యం మేరకు అవసరమైతే ఇంటర్మీడియట్ గోడౌన్లను సిద్ధం చేసుకోవాలని అన్నారు. మిల్లింగ్ చార్జీలు గతంలో చాలా తక్కువగా ఉండేవని, వీటిని పెంచేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి మన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొనగా, మధిర తహసీల్దార్ కార్యాలయం నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, తహసీల్దార్, మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story