ఆయనపై అసత్య ఆరోపణలు తగదు.. ఖమ్మం క్రెడాయ్‌ అధ్యక్షుడు

by Web Desk |
ఆయనపై అసత్య ఆరోపణలు తగదు.. ఖమ్మం క్రెడాయ్‌ అధ్యక్షుడు
X

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం స్థంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ అక్రమాలకు పాల్పడుతూ రియల్ వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ఖమ్మం క్రెడాయ్ అధ్యక్షుడు కొప్పు నరేష్ స్పందించారు. సుడా చైర్మన్‌పై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో శనివారం పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

అందులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్గనిర్దేశంలో సుడా ఏర్పడిన తర్వాత డీటీసీపీ లే ఔట్‌లకు అనుమతులు, తదితర సదుపాయాలు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. నగరం, జిల్లాలోని వ్యాపారులకు సుడా అభయం వంటిదన్నారు. వెంచర్ల అనుమతుల విషయంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి పరిస్థితి ఏమీ లేదని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గతంలో సుడా ఏర్పడక ముందు రియల్ వ్యాపారులు ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రస్తుతం లేవని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవాయి రవి, శ్రీ సిటీ అధినేత ఆంజనేయ ప్రసాద్, కలిల్ తదితరులు పాల్గొన్నారు.


Next Story