అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం.. ముగ్గురు అరెస్ట్

by Taduka Kalyani |

ఖమ్మం జిల్లా మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం క్రాస్ రోడ్ వద్ద సోమవారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, మధిర :ఖమ్మం జిల్లా మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం క్రాస్ రోడ్ వద్ద సోమవారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చేపట్టిన తనిఖీలలో ఎస్కార్ట్ వాహనంగా వెళ్తున్న కారును అడ్డగించి విచారించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం ఇసుక రీచ్ నుండి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తెలంగాణ రాష్ట్రానికి తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. అనంతరం పోలీసులు వెంబడించి ఇసుకతో నిండిన ఒక టిప్పర్ లారీని పట్టుకోగా, మరో రెండు టిప్పర్లు అక్కడి నుంచి తప్పించుకున్నాయి. ఈ ఘటనలో కట్రాల గోపి, ముక్తవరపు శిఖామణి నారంశెట్టి ఉమా మహేష్ @ మహేష్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 40 టన్నుల ఇసుక లోడుతో ఉన్న టిప్పర్ లారీ, ఎస్కార్ట్‌గా ఉపయోగించిన హోండా ఎక్సెంట్ కారు, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు గతంలో కూడా పలుమార్లు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడి ఖమ్మం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయించినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుల్లో ఇద్దరు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అక్రమ ఇసుక రవాణా కేసులో పట్టుబడిన ముగ్గురు నిందితులను మంగళవారం మధిర న్యాయస్థానంలో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైరా సబ్ డివిజన్‌ ఏసీపీ సారంగపాణి , మధిర రూరల్ సీఐ డి.మధు లు ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వైరా ఏసీపీ సారంగపాణి మధిర రూరల్ ఎస్సై విశ్వతేజ ను మధిర రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు.

Next Story