నగల వ్యాపారికి రూ.43 లక్షల టోకరా.. ఇద్దరిపై కేసు

by Taduka Kalyani |

ప్రముఖ నగల వ్యాపారి ని నమ్మించి రూ.43 లక్షలకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలను కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

నగల వ్యాపారికి రూ.43 లక్షల టోకరా.. ఇద్దరిపై కేసు
X

దిశ, ఖైరతాబాద్: ప్రముఖ నగల వ్యాపారి ని నమ్మించి రూ.43 లక్షలకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలను కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవంతి నగర్ కాలనీకి చెందిన సుమిత్ అగర్వాల్, బషీర్‌బాగ్‌లోని వర్షిక జువెలర్స్ యజమానిగా వజ్రాల పొదిగిన బంగారు ఆభరణాల తయారీ, సరఫరా వ్యాపారం నిర్వహిస్తున్నారు.2024 అక్టోబర్‌లో మిహిర్ జనక్‌కుమార్ షా అనే వ్యక్తి తనను పంజాగుట్టలోని కార్బన్ లక్స్ జ్యువెలరీ సంస్థకు అధికార ప్రతినిధి, బిజినెస్ కోఆర్డినేటర్‌గా పరిచయం చేసుకున్నాడు. సంస్థకు విస్తృతమైన ఖాతాదారులు ఉన్నారని, కన్సైన్‌మెంట్ పద్ధతిలో వజ్రాభరణాలు సరఫరా చేయాలని కోరాడు. విక్రయాల అనంతరం స్వచ్ఛమైన బంగారం బరువును తిరిగి ఇచ్చి, వజ్రాలు, రంగురాళ్లు, మేకింగ్ చార్జీల విలువను చెల్లిస్తామని హామీ ఇచ్చాడు.

వారి మాటలు నమ్మిన బాధితుడు 2024 అక్టోబర్ 9న తొలిసారిగా 511.758 గ్రాముల బంగారంతో కూడిన వజ్రాభరణాలను సుమారు రూ.43.53 లక్షల విలువతో కన్సైన్‌మెంట్‌గా అందజేశాడు. నమ్మకం కల్పించేందుకు నిందితులు దశలవారీగా 500 గ్రాముల బంగారం తిరిగి ఇచ్చి, రూ.35.85 లక్షలు చెల్లించారు. అయితే ఇంకా 11.758 గ్రాముల బంగారంతో పాటు మిగిలిన బకాయిలు చెల్లించలేదు. తర్వాత బకాయిల గురించి ప్రశ్నించగా, జూబ్లీహిల్స్‌లో ప్రారంభించనున్న రుద్రా జెమ్స్ అండ్ డైమండ్స్ షోరూమ్ కోసం మరో కన్సైన్‌మెంట్ ఇవ్వాలని కోరారు. వారి మాటలు నమ్మిన బాధితుడు 2024 నవంబర్ 21న 524 గ్రాముల స్వచ్ఛమైన బంగారం తో కూడిన వజ్రాభరణాలను సుమారు రూ.33.75 లక్షల విలువతో మరోసారి అప్పగించాడు. అయితే ఈసారి నిందితులు బంగారం గానీ, వజ్రాల విలువ గానీ, మేకింగ్ చార్జీలు గానీ తిరిగి చెల్లించలేదు. మొదటి లావాదేవీలో కొంత చెల్లింపు చేసి నమ్మకం సంపాదించి, అనంతరం భారీ విలువైన నగలను మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story