డీజీపీ సొంతూరులో నేల చూపులు చూస్తున్న సీసీ కెమెరాలు

by Web Desk |
డీజీపీ సొంతూరులో నేల చూపులు చూస్తున్న సీసీ కెమెరాలు
X

దిశ,పాలేరు: బహిరంగ ప్రదేశాల్లో జరిగే నేరాలను అరికట్టడంతో పాటు పలు కేసులను ఛేదించేందుకు సీసీ కెమెరాలు దోహదపడ్డాయని డీజీపీ స్వయంగా పలు సందర్భాల్లో చెప్పారు. అలాగే ఒక సీసీటీవీ 100 మంది పోలీసులతో సమానమని కూడా అదే శాఖ వారు ఎన్నో సందర్భంలో సీసీ కెమెరాల ఆవశ్యకత సమావేశాల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి స్వగ్రామం కిష్టాపురం గ్రామంలో ఏడాదిన్నర క్రితం పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (సీసీటీవీ) కెమెరాలను అమర్చారు. కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలో అప్పటి రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దాతల సహాయంతో నాలుగు లక్షల వ్యయంతో వివిధ ప్రాంతాల్లో దాదాపు 14 సీసీటీవీలను ఏర్పాటు చేశారు.

వీటిని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ వ్యవస్థ నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీకి అప్పగించారు. కంట్రోల్ రూమ్‌ని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే కొన్నాళ్ళు సజావుగా పని చేసిన ఈ వ్యవస్థ కూసుమంచి సర్కిల్ పరిధిలోనే పెద్ద యూనిట్‌గా ఉండేది. తర్వాత గ్రామంలోని వివిధ కూడళ్లలో ఉన్న కెమెరాలు నిర్వహణ సరిగా లేక మూలన పడి బిత్తర చూపులు చూస్తున్నాయి. అందులో ఒక కెమెరాను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించగా, మిగిలినవి నిర్వహణ సరిగా లేకపోవడంతో పనికిరాకుండా పోయాయి.

లక్షలు పోసి ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ను గ్రామ పంచాయతీ కాని, కూసుమంచి పోలీసులు కానీ పునరుద్ధరించి, నిర్వహించటం పెద్ద కష్టం కాకపోయినా ఆ చొరవ ఎవరు తీసుకోవాల్నో పెద్ద మీమాంశగా మారింది. అయితే ప్రతి గ్రామంలోనూ సమావేశాలు నిర్వహించి కెమెరాల ప్రాధాన్యత గురించి చెప్తున్న పోలీస్ శాఖ… డీజీపీ సొంతూరులోనైనా నిర్వాహణా బాధ్యత చేపట్టాలని శాంతిభద్రతల కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఈ కెమెరాల నిర్వహణపై పోలీసులు ఆసక్తి చూపకపోవడం విచారకరమని గ్రామస్తులు అంటున్నారు.

ఇక దిశ ఇదే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కోతులు కెమెరాలను పాడు చేస్తున్నాయని త్వరలోనే కెమెరాల మరమ్మతులు చేస్తామని అన్నారు.



Next Story

Most Viewed