దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ : మంత్రి పువ్వాడ

by Disha Web Desk 20 |
దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ : మంత్రి పువ్వాడ
X

దిశ, అశ్వారావుపేట : వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యాబోధన, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన, విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాలలో రూ.7.35 కోట్లతో రెండు అంతస్తులతో అన్ని వసతులు సౌకర్యాలతో 55 గదులతో నూతనంగా నిర్మించిన బాలికల హాస్టల్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖముఖీలో వారు మాట్లాడుతూ వ్యవసాయ విద్యను ఎంపిక చేసుకున్న విద్యార్థులను మంత్రి అభినందించారు.

వ్యవసాయ రంగాన్ని విద్యగా ఎంచుకోవడం దేశ ప్రగతిలో భాగస్వాములం కావడమే అని, మనం చేస్తున్న సేవ దేశానికి చేస్తున్న సేవ లాంటిది అని, దేశాన్ని కాపాడే సైనికుడికి కూడా అన్నం పెట్టే విద్యను మనం చేస్తున్నమని అన్నారు. తాను కూడా ఎంఎస్సీ అగ్రికల్చరల్ లో గోల్డ్ మెడల్ సాధించినని గుర్తు చేశారు. వ్యవసాయం పై ఎంతో మక్కువతో ఈ రంగాన్ని ఎంచుకున్నానని, వ్యవసాయ పట్టభద్రుడనైన తాను నేడు ఈ కళాశాలకు రావడం తన సొంత ఇంటికి వచ్చినట్లు ఉందన్నారు. మంత్రి హోదాలో వ్యవసాయ కళాశాలలో ఇంత మంచి కార్యక్రమం వారి చేతుల మీదగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 30ఏళ్ల క్రితం అగ్రికల్చరల్ కోర్స్ ను ఎంపిక చేసుకున్నపుడు ఆయన స్నేహితులు కొందరు వొద్దు అన్న సందర్భాలు ఉన్నాయని, ఆయనకు ఉన్న ఇష్టం మక్కువతో వ్యవసాయం పీజీ పూర్తి చేయడం గర్వంగా అనిపించిందన్నారు.

వ్యవసాయంలో విస్తరణ జరగాలని అప్పుడే అనేక కల్పనలు చేశారని, అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేసి చూపించారని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని కేసీఆర్ విస్తరించారని రైతులకు అనేక సదుపాయాలు, ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు, అందిస్తూ రైతు బంధు, రైతు భీమా సదుపాయాలు కల్పించి వ్యవసాయాన్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నారని వివరించారు. కోట్లు రూపాయలను వ్యవసాయ విస్తరణ అధికారుల చేతుల మెడగ రైతులకు అందిస్తున్నారని, వువసాయ విద్యార్థులుగా అంతకంటే ఏం కావాలని, ఇది మనకు గర్వకారణం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిన విషయం గుర్తు చేశారు.

వ్యవసాయ విద్యార్థుల సౌకర్యార్థం.. సుమారు రూ.7.35 కోట్లతో అత్యాధునిక హంగులతో వసతి గృహం నిర్మించడం జరిగిందన్నారు. వ్యవసాయ విద్యను ఇష్టంతో పూర్తి చేసి మంచి వ్యవసాయ అధికారులుగా మారి రైతులకు తమ అమూల్యమైన సలహాలు సుచనలు చేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ది చెందేలా చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, డీఎస్ఏ జల్ల శ్రీనివాస్ రావు, అసిస్టెంట్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ హుస్సేన్, ప్రొఫెసర్ గోపాల కృష్ణ మూర్తి, విద్యుత్ ఎస్ఈ రమేష్, ఎస్టేట్ ఆఫీసర్ మోహన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed