ఆధార్ అప్డేట్ తప్పనిసరి

by Disha Web Desk 1 |
ఆధార్ అప్డేట్ తప్పనిసరి
X

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్

దిశ, లక్ష్మీదేవిపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు పొందేందుకు ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆధార్ అప్డేట్ ప్రక్రియపై జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు సులభంగా పొందేందుకు ఆధార్ అప్డేట్ తప్పనిసరని పేర్కొన్నారు. రానున్న నెల రోజుల్లో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. 0-6 సంవత్సరాలు ఉన్న చిన్నారులకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఆధార్ కార్డు జనరేట్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని డీఆర్వోకి సూచించారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉంటుదన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకుండా ఉండకూడదన్నారు. జిల్లాలో 40 వేల మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేసేందుకు అంగన్వాడి కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సంక్షేమ అధికారికి సూచించారు. ఆధార్ బయోమెట్రిక్ పడని లబ్ధిదారులు రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, జిల్లా పౌర సరఫరాల అధికారి నుంచి సంబంధిత జాబితా సేకరించి సమస్య పరిష్కారానికి రాష్ట్ర కార్యాలయానికి సిఫారసు చేయాలన్నారు. జిల్లాలో ఆధార్ లేని విద్యార్థులు 1,852 మంది ఉన్నారని వారి ఆధార్ నమోదు కొరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ఎమ్మార్సీలకు లక్షాన్ని నిర్దేశించి విద్యార్థులకు ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం సిబ్బంది ఆధార్ అప్డేట్ కొరకు చర్యలు చేపట్టాలని డీఆర్డీవోకి సూచించారు. పుట్టిన వెంటనే బర్త్ రిజిస్ట్రేషన్ తో పాటు ఆధార్ కూడా జనరేట్ చేయాలని వైద్య, సంక్షేమ అధికారులకు సూచించారు. అనంతరం అప్డేట్ చేసిన ఆధార్ జీవితాన్ని సులభతరం చేస్తుందనే గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో డీఆర్డీవో మధుసూదన్ రాజు, డీపీవో రమాకాంత్, జడ్పీ సీఈవో విద్యాలత, జిల్లా వైద్యాధికారి డా.శిరీష, సంక్షేమ అధికారి లెనీనా, డీఈవో ప్రసాద్, డీఆర్వో అశోక్ చక్రవర్తి, అదనపు ఎస్పీ నందిరామ్, ఏవో గన్యా, పోస్టల్ పర్యవేక్షకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed