ఖమ్మం జిల్లాకు అరుదైన అవకాశం

by Disha Web Desk 15 |
ఖమ్మం జిల్లాకు అరుదైన అవకాశం
X

దిశ, వైరా : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గురువారం ప్రకటించిన మంత్రి పదవుల్లో ఖమ్మం జిల్లాకు అరుదైన అవకాశం లభించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ అరుదైన గౌరవం, అవకాశం చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో డిప్యూటీ సీఎం గా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ఎంపిక కావటం విశేషం. అయితే ఈ మంత్రి వర్గ విస్తరణలో గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండి ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొండి చేయి చూపటం విశేషం. 2004వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు రెండు మంత్రి పదవులు లభించాయి.

అప్పట్లో కొత్తగూడెం నుంచి గెలుపొందిన వనమా విశ్వేశ్వరరావు, పాలేరు నుంచి గెలుపొందిన సంభాని చంద్రశేఖర్ లకు వైఎస్సార్ మంత్రి పదవులు కేటాయించారు. అప్పుడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం కేవలం ఒక్క ఖమ్మం జిల్లాకే మూడు మంత్రి పదవులు రావడం విశేషం. 1992 సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం మినహా మిగిలిన అన్ని ప్రభుత్వాల్లో ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి పదవి లభించింది. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటివరకు శీలం సిద్ధారెడ్డి, జలగం వెంగళరావు, తుమ్మల నాగేశ్వరావు, జలగం ప్రసాదరావు, కోనేరు నాగేశ్వరావు, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా పని చేశారు. వీరిలో 2004లో ఒకేసారి సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు మంత్రులుగా పనిచేశారు.

మిగిలినవారు ఆయా ప్రభుత్వాల్లో ఒక్కొక్కరుగా మంత్రి పదవి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగడంతో పాటు 2009 నుంచి 2023 వరకు వరుసగా నాలుగు సార్లు మధిర ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. అనేక దశాబ్దాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద ఇప్పటివరకు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావుకు మరో సారి మంత్రి పదవి వరించింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఆర్థికంగా కృషి చేయడంతో పాటు సీఎం కేసీఆర్ ను రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కేవలం ఒక్క ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించడంతో ఖమ్మం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed