కొలువుదీరిన ఖైరతాబాద్ గణపయ్య.. ఈ సారి విశిష్టత ఇదే!

by Disha Web Desk |
కొలువుదీరిన ఖైరతాబాద్ గణపయ్య.. ఈ సారి విశిష్టత ఇదే!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ఖైరతాబాద్‌ బొజ్జగణపయ్య కొలువుదీరాడు. బుధవారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించిన తొలిపూజకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, ఉపాధ్యక్షుడు నగేష్‌ హాజరయ్యారు. మొదటిరోజు పూజలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కాగా ఈ ఏడాది ప్రత్యేకంగా శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణపయ్యను 50 అడుగుల ఎత్తులో మట్టితో తయారుచేయడం విశేషం.

1954 లో ఒక్క అడుగుతో మొదలై....

1954లో ఖైరతాబాద్ గణేషుడు మొదటి సారిగా ఒక్క అడుగుతో కొలువుదీరాడు. అనంతరం ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తుండగా 2014లో విగ్రహం ఎత్తు 60 అడుగులకు చేరడంతో షష్టి పూర్తి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న వినాయక విగ్రహాన్ని మట్టితో 50 అడుగుల ఎత్తుతో తయారు చేశారు. ప్రజలందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని పంచముఖ లక్ష్మీ గణపతిగా రూపొందించారు. విగ్రహానికి కుడి వైపున మయూర వాహనంపై షణ్ముక సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున త్రిశక్తి గాయత్రీ దేవి కొలువు దీరారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వ సూచనలతో 68 ఏళ్లలో తొలిసారిగా మట్టితో తయారుచేయగా.. జూన్ 10 నుంచి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 35 టన్నుల మట్టితో 150 మంది కళాకారులు 80 రోజులపాటు రాత్రి పగళ్లు పనిచేసి గణపతికి తుదిరూపమివ్వగా.. భారీ వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విగ్రహాన్ని రూపొందించారు. మహాగణపతిని పాదాలకు సమీపం నుండి నమస్కరించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకంగా పాదాలకు నమస్కరించే విధంగా పాదముద్రికలు అందుబాటులో ఉంచారు. కాగా ఇందుకోసం సుమారు రూ 1.5 కోట్లు ఖర్చు అయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో లడ్డు కోసం జరిగిన తొక్కిసలాట కారణంగా లడ్డు నైవేద్యం నిలిపేసి, ప్రస్తుతం బొమ్మ లడ్డును మాత్రమే గణపయ్య వద్ద ఉంచుతున్నారు. కాగా ఈనెల 9న హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం జరగనుంది.

55 అడుగుల జంజం

కరోనాతో రెండేళ్లుగా సాదాసీదాగా జరిగిన ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 55 అడుగుల జంజం, 50 అడుగుల కండువ సమర్పించారు. ఇక అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయగా.. సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేయడం ద్వారా పోలీస్ శాఖ పటిష్టంగా బందోబస్తు చర్యలు చేపట్టింది. మఫ్టీలో కూడా పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.



Next Story

Most Viewed