KRMB పర్మిషన్ లేకుండా AP నీళ్లు డ్రా చేయొద్దు: తెలంగాణ అధికారులు

by Gantepaka Srikanth |

నాగార్జునసాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టుల ద్వారా మరో 15 టీఎంసీలు మాత్రమే వాడుకునే చాన్స్ ఉందని.. తెలంగాణ తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలు కేటాయించాలని కేఆర్ఎంబీ త్రీమెన్ కమిటీకి తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

KRMB పర్మిషన్ లేకుండా AP నీళ్లు డ్రా చేయొద్దు: తెలంగాణ అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జునసాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టుల ద్వారా మరో 15 టీఎంసీలు మాత్రమే వాడుకునే చాన్స్ ఉందని.. తెలంగాణ తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలు కేటాయించాలని కేఆర్ఎంబీ త్రీమెన్ కమిటీకి తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు పోను ఏపీకి కేవలం 0.5 టీఎంసీలు మాత్రమే వాడుకునే వీలుందని చెప్పారు. సోమవారం ఇరు రాష్ట్రాల అధికారులతో వేసవి తాగునీటి అవసరాలపై కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో సోమవారం త్రీమెన్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాగా.. ఏపీ అధికారులు అటెండ్ కాలేదు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు నిపుణులు వస్తున్న నేపథ్యంలో తాము సమావేశానికి రాలేమని ఏపీ అధికారులు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఈ నెల 10వ తేదీ తరువాత మళ్లీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బోర్డు మెంబర్‌ సెక్రటరీ, ఇరు రాష్ర్టాల ఈఎన్సీ (ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌)లతో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేస్తుంటుంది. అయితే.. సోమవారం నిర్వహించిన సమావేశానికి ఏపీ అధికారులు రాకపోవడంతో తెలంగాణ అధికారులు తమ డిమాండ్లను వినిపించారు. ఇప్పటికే.. వచ్చే నెలాఖరు వరకు తమకు శ్రీశైలం, సాగర్ నుంచి 16 టీఎంసీలు కావాలని తెలంగాణ, మే నెలాఖరు వరకు సాగర్ కుడికాల్వ నుంచి తమకు 10 టీఎంసీలు కావాలని ఏపీ బోర్డుకు నివేదించాయి.

15 టీఎంసీలే డ్రాకు చాన్స్

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 50 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. డెడ్ స్టోరేజీ పోను ఇరుప్రాజెక్టుల నుంచి కేవలం 15 టీఎంసీలు మాత్రమే డ్రా చేసుకునే చాన్స్ ఉందని రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు కేఆర్ఎంబీ దృష్టికి తీసుకొచ్చారు. వీటిలో నుంచి 4.5 టీఎంసీల వరకూ ఎండలకు డ్రై అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దాంతో తాగునీటికి 10 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాడుకునే వీలుంటుందని చెప్పారు. వాటిని రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. ఇక ఏపీ మిగిలిన 0.5 టీఎంసీలు వాడుకోవచ్చని తెలంగాణ ఈఎన్సీ చెప్పారు. తెలంగాణకు సంబంధించి ఖమ్మంకు 300 క్యూసెక్కులు, మహబూబ్‌నగర్‌కు 300 క్యూసెక్కులు, హైదరాబాద్‌కు 750 క్యూసెక్కులు రోజు వారీగా డ్రా చేస్తామని తెలిపారు. మూడు నెలల్లో మొత్తంగా 10 టీఎంసీలు తెలంగాణకు అవసరమని చెప్పారు. అలాగే.. సాగర్‌లో కనీస మట్టం 510 అడుగుల వరకు ఉంచాలని ఈఎన్సీ అనిల్‌కుమార్ తెలిపారు. 510 దిగువకు పంపింగ్ సరికాదని, ఏపీ వినియోగం తగ్గించుకోవాలని గతంలోనే చెప్పామని ఈఎన్సీ పేర్కొన్నారు. నీటి విడుదలపై తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్, ముచ్చుమర్రి నుంచి నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు. లేదంటే తెలంగాణ నీటి ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అయితే.. వీటిపై రాతపూర్వకంగా ఇవ్వాలని కేఆర్ఎంబీ సూచించింది. ఈ సమావేశంలో కేఆర్ఎంబీ సెక్రెటరీ రాయిపూరి, ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్, నల్లగొండ, సూర్యాపేట సీఈలు పాల్గొన్నారు.

Next Story