బీఆర్ఎస్‌కు కీలక నేతలు గుడ్ బై.. ఇవాళే కాంగ్రెస్‌లో చేరిక!

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌కు కీలక నేతలు గుడ్ బై.. ఇవాళే కాంగ్రెస్‌లో చేరిక!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నాలుగు ముఖ్య నేతల కుటుంబాలు బీఆర్ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు.. ఇవాళ ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని ఫిక్స్ అయ్యారు. కాగా, ఇటీవల బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితా రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో వేర్వేరుగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు కాంగ్రెస్ నేతలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు.

ఇవాళ మధ్యాహ్నం వీరంతా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు రానున్నారు. వీరికి దీపా దాస్ మున్షి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన కేవలం నెలల వ్యవధిలోనే ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. అయితే నెలల వ్యవధిలోనే పరిస్థితిలో ఎంతో మార్పు కనబడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే బాటలో మరికొందరు నేతలు ఉన్నారు.

Next Story

Most Viewed