వారికి బూత్‌లో సమాధానం చెప్పండి.. ఎన్నికల వేళ వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
వారికి బూత్‌లో సమాధానం చెప్పండి.. ఎన్నికల వేళ వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమని మాజీ భారత ఉపరాష్ట్రపతి, పద్మ విభూషన్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సన్మానించింది. సన్మానం అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఇంతటి చక్కటి కార్యక్రమానికి నాయకత్వం వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నట్లు తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని సన్మానించడం గొప్ప విషయమన్నారు. మరోవైపు తనతో పాటు పద్మ అవార్డు పొందిన అందరికి, వారితో పాటు మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు చిత్ర కళామ్మతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, మూడో కన్ను చిరంజీవి అని కొనియాడారు. తాను జీవితంలో పెద్దగా అవార్డులు తీసుకోలేదని చెప్పారు. కానీ, కేంద్రం మీకు అవార్డు ఇస్తున్నామని చెబితే మోడీ మీద గౌరవంతో తీసుకున్నానని తెలిపారు.

జీవితంలో కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని చెప్పారు. ‘రేవంత్ రెడ్డిని తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎంతో ఉత్సాహం, చురుకుదనం ఉన్న వ్యక్తి. ఏదైనా తలుచుకుంటే దాని లోతు చూసే వరకు వదలడు. అవార్డులు పొందినాక ఇలాంటి సన్మానాలు చేస్తే మరింత ఆనందంగా ఉంటుంది. రేవంత్ రెడ్డిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని అన్నారు. ఆ ప్రమాణాలను చక్కదిద్దాల్సిన అవసరం అందరిమీదా ఉందని చెప్పారు. బూతుల నేతలకు పోలింగ్ బూతులో సమాధానం చెప్పాలని సూచించారు. నీతి, నిజాయితీ లేని వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేవలం నాలుగు ‘సి’లను నమ్ముకొని కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా విలువలు పాటించాలని తెలిపారు. ఇష్టపడిన శ్రమను కష్టపడి పనిచేస్తే.. నష్టపోయేది ఏమీ ఉండదని తెలిపారు. పట్టుదలే మనిషి జీవితాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు.



Next Story

Most Viewed