గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు: సీఎం కేసీఆర్

by Disha Web Desk 2 |
గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు: సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఏం జరిగిందని.. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నాందేడ్‌లో శుక్రవారం మహారాష్ట్రలో నేతలకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించామని వెల్లడించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలను చూసి కొంతమంది నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ అమలు కావాలని ఆకాంక్షించారు. దేశంలో నీరు పుష్కలంగా ఉందని అయినా వాడుకోలేకపోతున్నామని.. భూమి ఉన్న వినియోగించుకోలేకపోతున్నామని అన్నారు. సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అకోలా, ఔరంగాబాద్‌లో వారానికి ఒకసారి నీరు వస్తుందని ఇది పాలకుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. దేశం మొత్తం ఒకే తరహా పరిస్థితి ఉందని, దాదాపు అన్ని రాష్ట్రాల్లో రైతు ఉద్యమాలు జరిగాయని, ఆందోళనలో ఎంతోమంది రైతులు చనిపోయారని, రైతులంటే గౌరవం లేదా? నిత్యం పోరాడుతూనే ఉండాలా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని.. ప్రతి గ్రామం నుంచి పార్టీ సభ్యత్వాలు చేయాలని, గ్రామ కమిటీలు వేయాలని... అన్ని కమిటీల్లో రైతులు, మహిళలకు అవకాశం కల్పించాలని సూచించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించాలని.. పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, మహారాష్ట్ర నేతలు పాల్గొన్నారు.

Read More: బీసీల నయవంచనకు కేసీఆర్ ప్లాన్.. YS షర్మిల కీలక వ్యాఖ్యలు


Next Story