గ్రేటర్ ఎమ్మెల్యేలతో ముగిసిన భేటీ.. KTR కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-21 12:38:39  IST  )

గ్రేటర్( Greater HYD) పరిధిలోని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక(KTR) వ్యాఖ్యలు చేశారు.

గ్రేటర్ ఎమ్మెల్యేలతో ముగిసిన భేటీ.. KTR కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్( Greater HYD) పరిధిలోని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక(KTR) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలకు కేరాఫ్‌గా హైదరాబాద్ మారిందని అన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు చేసేవరకు పేదల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని కీలక ప్రకటన చేశారు. తెలంగాణ గ్రోత్‌ ఇంజిన్‌(Telangana Growth Engine)ను కాపాడాల్సిన బాధ్యత.. ఈ రాష్ట్రాన్ని సాధించిన తమపై ఉందని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న పారిశుధ్య ఇబ్బందులు, తాగునీటి సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సమస్యల పరిష్కారం, నగర ప్రజలకు కలిగించాల్సిన భరోసాపై ఎమ్మెల్యేలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్‌ పాలనలో రోడ్లపై బిందెలు దర్శనమిచ్చిన రోజు ఒక్కటి కూడా లేదని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు నగర రూపురేఖల్నే మార్చేశాయని తెలిపారు. కేసీఆర్ అమలుచేసిన సమగ్రమైన ప్రణాళికలతో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయని అన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని పేదలు ఎదురు చూస్తున్నారన్నారు.

అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, రైతుభరోసా అందేలా బీఆర్ఎస్ నేతలు చూడాలని కేటీఆర్ ఆదేశించారు. బీఆర్ఎస్ హయంలో కంచెలు వేసి కాపాడిన ప్రభుత్వ పార్కులకు కూడా రేవంత్ సర్కార్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రోజూ అనేకచోట్ల కబ్జా జరుగుతోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా హైదరాబాద్ ప్రజలంతా బీఆర్ఎస్‌కు పట్టం కట్టారని.. వారి బాధలు తీర్చాలని బాధ్యత తమపై ఉందని ఎమ్మెల్యేలకు సూచించారు.

Next Story