కాళేశ్వరంపై కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి: అద్దంకి దయాకర్ సవాల్

by Ramesh Naini |

ఇంట్లో ఉండడానికి కేసీఆర్‌కు ప్రతిప‌క్ష నాయ‌కుడి ప‌ద‌వి ఇచ్చారా? కాళేశ్వరం డిజైన్ చేసి కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడాలని శాసనమండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు.

కాళేశ్వరంపై కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి: అద్దంకి దయాకర్ సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంట్లో ఉండడానికి కేసీఆర్‌కు ప్రతిప‌క్ష నాయ‌కుడి ప‌ద‌వి ఇచ్చారా? కాళేశ్వరం డిజైన్ చేసి కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడాలని శాసనమండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ల‌క్షల కోట్ల ప్రజాధ‌నం వృథా చేసిన తీరు చూసి మాకు ర‌క్తం మ‌రుగుతోందని, కాళేశ్వరం పైన ఒక్క నిమిషం మాట్లాడే నైతిక అర్హత హ‌రీశ్ రావుకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం బ్యారేజీలు అక్కడ క‌ట్టొద్దని రిటైర్ ఇంజ‌నీర్లు గ‌తంలో ఇచ్చిన రిపొర్ట్‌ను ఎందుకు కేసీఆర్ ప‌క్కన పెట్టాడడని, బ్యారేజీ నింపితే ర‌క్షణ లేద‌ని చెపుతుంటే క‌న్నెప‌ల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఇవ్వమ‌ని హ‌రీష్ రావు చెపుతున్నాడని మండిపడ్డారు. క‌న్నెప‌ల్లి పంప్ హౌస్ ద‌గ్గర నీళ్లు ఎక్కడున్నాయి, ఎన్డీఎస్ఏ మాట‌లు న‌మ్మాలా? హ‌రీష్ రావు లాంటి దొంగ‌ల మాట‌లు వినాలా? తొమ్మిదిన్నర ఏళ్లలో నాలుగేళ్లు ఇరిగేష‌న్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు, మూడు నెల‌లు ఇస్తే ఏం చేస్తాడని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి మ్యాప్ వేసి చూపించినా..

సీఎం రేవంత్ రెడ్డి మ్యాప్ వేసి చూపించినా వీళ్లకి అర్థం కావ‌డం లేదని, బ్యారేజీలు కూలిపోతాయ‌ని చెపుతుంటే నీళ్లు ఎత్తిపోయాల‌ని మాట్లాడుతున్నాడని అద్దంకి దయాకర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. క‌న్నెప‌ల్లి పంప్ హౌస్ ను చివ‌ర క‌ట్టమ‌ని చెప్పింది ఎవ‌రు? నీళ్లు ఎక్కడ ఉంటాయో అక్కడ పుట్ బాల్ ఉండాలన్నారు. కేసీఆర్ ఒప్పుకుంటే ప్రత్యేక అసెంబ్లీ స‌మావేశాలు పెట్టి కాళేశ్వరంపైన చ‌ర్చించడానికి మేం సిద్ధమని, అసెంబ్లీలో చ‌ర్చకు రాకుంటే కాళేశ్వరం దొంగ‌లుగా భావించాల్సి వ‌స్తుందని అద్దంకి దయాకర్ విమర్శించారు. కేసీఆర్ దొంగ దీక్ష చేశార‌ని రికార్డులు చెపుతున్నాయని, శ్రీకాంతా చారి కిరోసిన్ పోసుకుని త‌గ‌ల‌బ‌డితే, హ‌రీశ్ రావు కిరోసిన్ పోసుకున్నా ఎందుకు త‌గ‌ల‌బ‌డ‌లేదు? హ‌రీశ్ రావు కిరోసిన్ డ్రామా వ‌ల్ల అనేక మంది ఆత్మహ‌త్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బిల్లు పెట్టిన‌ప్పుడు కూడా కేసీఆర్ పార్లమెంటులో లేడని ఆరోపించారు. ప్రతిప‌క్ష నాయ‌కుడు అడ్రస్ లేడని, ఈటెల రాజేంద‌ర్ కేసీఆర్ పాట పాడుతున్నాడని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. హ‌రీశ్ రావును బీజేపీ లోకి తీసుకెళ్లడానికి ఈటెల రాజేంద‌ర్ ప్రయ‌త్నం చేస్తున్నాడో, లేక ఆడ ఏమీ లేద‌ని ఈటెలను బీఆర్ఎస్ లోకి తెచ్చేందుకు హ‌రీశ్ రావు ప్రయ‌త్నం చేస్తున్నాడో అని ఆయన ఆరోపించారు. ప్రాణ‌హిత చేవేళ్ల ను చెడ‌గొట్టి కాళేశ్వరం పెట్టుకున్నారని, అంబేద్కర్ పేరు ఉంద‌ని ప్రాణ‌హిత‌ను ప‌క్కన పెట్టారని అద్దంకి దయాకర్ ఆరోపించారు.

ఇద్దరి పాత్ర కూడా అంతే..

తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో, హరీశ్ రావు పాత్ర కూడా అంతే ఉందని, ఆయనవన్నీ అబద్ధపు మాటలని టీపీసీసీ ఫిషర్‌మెన్ చైర్మన్, మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిల్లర మాటలు మాట్లాడే హరీష్ రావుకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని, రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉందన్నారు. ఇప్పటికైనా హరీశ్ రావు చిల్లర మాటలు బంద్ చేయాలని మెట్టు సాయికుమార్ హితవు పలికారు.

Next Story