బిగ్ న్యూస్: ఏపీలో ఎంట్రీకి కేసీఆర్ కొత్త స్కెచ్.. ఆ ఇష్యూపై BRS సడెన్ యూటర్న్!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: ఏపీలో ఎంట్రీకి కేసీఆర్ కొత్త స్కెచ్.. ఆ ఇష్యూపై BRS సడెన్ యూటర్న్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీలో ఎంట్రీ కోసం బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అక్కడి ప్రజల ఆదరణ కోసం తెలంగాణకు నష్టం జరిగినా పర్వాలేదనే ధోరణిని అవలంభిస్తోంది. ఓట్ల కోసం స్టాండ్‌నే మార్చుకుంది. నిన్నటిదాకా పోలవరం ప్రాజెక్టుపై విమర్శలు చేసినవారే నేడు కేసీఆర్‌తో సాధ్యమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ పోలవరంను రాజకీయంగా మల్చుకునే ప్రయత్నాన్ని స్టార్ట్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు పాలకులు తీవ్ర అన్యాయం చేశారని ఉద్యమించారు. ఉద్యమ సమయంలో అక్కడి పాలకులపై దుమ్మెత్తిపోశారు. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణను ముంచారని ప్రతి ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మలుచుకొని ఏపీపై మండిపడ్డారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

విశాఖ ఉక్కు.. పోలవరం ప్రాజెక్టు..

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్ ఏపీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి అడుగు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై గళమెత్తారు. కార్మికుల పక్షాన బీఆర్ఎస్ ఏపీ శాఖ నిరసనల్లో పాల్గొనాలని అధినేత ఆదేశించారు. అంతేగాకుండా ప్లాంట్ బిడ్జింగ్‌లోనూ పాల్గొనాలని భావించినా పార్టీ అధిష్టానం చివరకు వెనక్కి తగ్గింది.

తాజాగా మంత్రి మల్లారెడ్డి పోలవరం ప్రాజెక్టు పూర్తి కేసీఆర్‌తోనే సాధ్యమని, ఏపీలో రాబోయేది బీఆర్ఎస్ ప్ర భుత్వమేనని వ్యాఖ్యానించారు. ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాలేదని, అదే కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలోనే పూర్తి చేసుకొని నీరందిస్తున్నామని రెండింటిని పోల్చుతూ ప్రచారం చేస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు అక్కడి సమస్యలపైనే ఫోకస్ పెట్టారు. ఏ అంశం కలిసి వస్తుందోనని టెస్టు చేస్తూ మరీ ముందడుగు వేస్తున్నారు.

విలీన మండలాలు, ముంపు గ్రామాలు..

విభజన సమయంలో ఇప్పటికే ఏడు మండలాలను ఏపీలో కలిపారు. భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, వీఆర్ పురం, చింతూరు, పినపాక నియోజకవర్గంలో బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు, అశ్వారావుపేట నియోజకవర్గంలో కుక్కునూరు, వెలేరుపాడు మండలాలను ఏపీలో కలుపడంతో తెలంగాణ ప్రజలు గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు గ్రామాలకు వరదముంపు పొంచి ఉంది. ఇప్పుడు ఏపీ ప్రజల ఓట్ల కోసం బీఆర్ఎస్ ను ఆదరిస్తే ప్రాజెక్టు పూర్తి చేస్తామనే రాగం అందుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం అర్బన్ మండలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడుమండలాలు, పినపాక నియోజకవర్గంలోని చాలా గ్రామాలు నీటమునిగి అపార నష్టం జరుగనుంది.

ఏపీ ప్రభుత్వంపై మంత్రుల విమర్శలు..

తెలంగాణ మంత్రులు మాత్రం పోలవరం ప్రాజెక్టు రాగం అందుకోవడం చర్చనీయాంశమైంది. రాజకీయం కోసం తెలంగాణ ప్రజలను పణంగా పెట్టడానికైనా బీఆర్ఎస్ సిద్ధపడుతుందని పలువు ఆరోపిస్తున్నారు. రాజకీయాల కోసం పోలవరం రాగం అందుకుంటే చూస్తూ ఊరుకోబోమని ముంపు గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ నినాదంతో ఏపీలో ముందుకు వెళ్తారనేది చర్చనీయాంశమైంది. ఏపీలో కులరాజకీయాలు చేస్తూ ప్రజాసమస్యలను పట్టించుకోవడంలేదని మంత్రులు ఆరోపించారు. మంత్రి హరీశ్ రావు సైతం ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టినా ఏం అడగరు.. విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు.. అధికార పక్షం అడగరు.. ప్రతిపక్షం ప్రశ్నించదు.. ప్రజలను గాలికి వదిలేసి రాజకీయాలను చూసుకుంటున్నారని మండిపడ్డారు.

ఇది అప్పట్లో రాజకీయ దుమారం లేపింది. అదే విధంగా తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జ‌రుగుతుందో తెలియాలంటే తెలంగాణ ప్రజ‌ల‌ను పొరుగు రాష్ట్రానికి పంపాల‌ని త‌న మిత్రుడు చెప్పాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. ఏపీలో కరెంట్ సరిగా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ కాక రేపాయి. ఏపీ పాలకులు కేంద్రం దగ్గర బిచ్చమెత్తుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం లేపాయి.

Next Story