‘రైతులను ముంచే పనిలో కేసీఆర్’

by Disha Web Desk 4 |
‘రైతులను ముంచే పనిలో కేసీఆర్’
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో ఉన్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో బుడ్డ దొరలకు, జమీందార్లకు, ఉద్యమద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి, మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గప్పాలు కొడుతున్నాడని చురకలంటించారు. సీఎం చెప్పే తెలంగాణ మోడల్ అంటే.. తొమ్మిదేండ్లలో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమేనా అని ప్రశ్నించారు.

పంట బీమా ఇవ్వక పోవడం, పంట నష్టం జరిగితే మాట ఇచ్చి పరిహారం ఎగ్గొట్టడం, రాయితీ ఎరువులు, విత్తనాలు ఎత్తేయడం మోడలా? అని నిలదీశారు. బడా బాబులకు రూ.వేల కోట్ల రైతుబంధు దోచిపెట్టడం, ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకోవడం, కనీస కనికరం లేకుండా రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, అసైన్డ్ భూములను సైతం లాక్కొని రైతును రోడ్డునపడేయడం, కౌలు రైతు.. రైతే కాదని చెప్పడం, వరి వేస్తే ఉరేనని రైతులను బెదిరించడం ఇవన్నీ తెలంగాన మోడలేనా? అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే, బీఆర్ఎస్ నిజంగానే కిసాన్ సర్కార్ అయితే.. రుణమాఫీ చేయనందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 చోట్ల రైతులకే టికెట్లు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. దళిత రైతును ముఖ్యమంత్రి చేసి, ఇతర రైతులను మంత్రులను చేయాలన్నారు. మాట ఇస్తే.. తలనరుక్కునే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని షర్మిల ఘాటుగా స్పందించారు.


Next Story

Most Viewed