సుప్రీం కోర్టుకు కవిత : పిటిషన్‌లో కోరిందేంటి?

by Disha Web Desk 4 |
సుప్రీం కోర్టుకు కవిత : పిటిషన్‌లో కోరిందేంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో తాను నిందితురాలు కాదని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 160 ప్రకారం ఒక మహిళను ఆమె నివాసంలోనే ప్రశ్నించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం తనను ఈడీ చేస్తున్న విచారణలో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. తన నుంచి ఈడీ అధికారులు బలవంతంగా మొబైల్ ఫోన్‌ను తీసుకున్నారని, నిజానికి మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50(2), 50(3) ప్రకారం అలాంటి నిబంధన లేదని తన పిటిషన్‌లో వివరించారు.

ఈ నెల 11న తనను ఎంక్వయిరీ చేసిన ఈడీ అధికారులు సూర్యాస్తమయం తర్వాత కూడా ఆఫీసులోనే ప్రశ్నించారని గుర్తుచేశారు. తనను విచారించినప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏ వ్యక్తినీ తనతో పాటు కలిపి ప్రశ్నించలేదని కూడా పిటిషన్‌లో కవిత గుర్తుచేశారు. లిక్కర్ కేసులో ఒక నిందితుడి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన సమయంలో తన వ్యక్తిగత వివరాలను ఉద్దేశపూర్వంగానే ఈడీ లీక్ చేసిందని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటివరకు తనపైన ఎలాంటి కేసులు లేవని, కొద్దిమంది ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా తనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నదని ఈడీపై కవిత ఆరోపణలు చేశారు. అలాంటి స్టేట్‌మెంట్లను వాపస్ తీసుకుంటున్నట్లు ఇటీవల రామచంద్ర పిళ్ళై సైతం స్పెషల్ కోర్టును ఆశ్రయించారని సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిళ్లై స్టేట్‌మెంట్ విషయంలో ఈడీ అనుసరించిన విధానం తనకు అనేక సందేహాలను కలిగిస్తున్నదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు బుధవారం జరిగిన విచారణ సందర్భంగా కవిత తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వందనా సెహగల్ ఈ అంశాలను ప్రస్తావించారు.


Next Story