వ్యూహాత్మకంగా వెళ్తున్న కవిత..! నెక్ట్స్ ఎటాక్ అతడిపైనేనా..?

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఓ స్ట్రాటజీ ప్రకారం ‘కారు’ పార్టీపై ఎటాక్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

వ్యూహాత్మకంగా వెళ్తున్న కవిత..! నెక్ట్స్ ఎటాక్ అతడిపైనేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఓ స్ట్రాటజీ ప్రకారం ‘కారు’ పార్టీపై ఎటాక్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. పార్టీలో తన ఎదుగుదలను అడ్డుకున్న లీడర్లందరిపైనా విమర్శలు చేయకుండా కేవలం హరీశ్‌రావు, సంతోష్‌రావులనే ఆమె టార్గెట్ చేశారు. ఒకేసారి అందరిపై ఎటాక్ చేస్తే ప్రజల నుంచి తనకు సానుభూతి రాదేమోననే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఇద్దరు లీడర్ల గుట్టు మాత్రమే విప్పారనే చర్చ జరుగుతున్నది. రానున్న రోజుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనా విమర్శలు ఎక్కుపెడతారా? లేక ఆయన్ను మినహాయిస్తారా? అనేది చూడాల్సి ఉంది.

రక్త సంబంధీకుల జోలికి వెళ్లని కవిత

కవిత తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌లపై ఎలాంటి విమర్శలూ చేయలేదు. పైగా హరీశ్‌రావుతో జాగ్రత్తగా ఉండాలంటూ తన అన్నను అలర్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కేటీఆర్ విషయంలో ఆమె పాజిటివ్‌గా ఉన్నారా? లేక ప్రస్తుతానికి ఆయన జోలికి వెళ్లొద్దని అనుకున్నారా?.. అనే చర్చ జరుగుతున్నది. ఒక వేళ కవితకు కేటీఆర్ నుంచి పూర్తి స్థాయిలో సపోర్టు ఉండి ఉంటే ఆమెకు వ్యతిరేకంగా పార్టీలో జరిగిన వ్యవహారాలను ఆయన ఎందుకు కట్టడి చేయలేకపోయారు? అనే ప్రశ్న సైతం ఉత్పన్నం అవుతున్నది. తమ నేతకు జరిగిన అవమానం విషయంలో కేటీఆర్ పాత్ర సైతం ఉందని, టైం చూసుకుని కేటీఆర్ గుట్టు విప్పేందుకు తమ లీడర్ రెడీగా ఉన్నారని కవిత అనుచరులు చెబుతున్నారు.

హరీశ్‌రావుపై ఎందుకంత కోపం

కవిత ప్రెస్‌మీట్‌లో చెప్పిన మాటల తీరు చూస్తుంటే ఆమె ఆగ్రహం సంతోష్‌‌రావుపై తక్కువ.. హరీశ్‌రావుపై ఎక్కువగా కనిపించింది. ఉద్యమం నుంచి మొదలుకుని పార్టీ అధికారంలో ఉన్నంత వరకు తన సొంత అస్థిత్వం కోసం హరీశ్‌రావు అనేక వ్యవహారాలు నడిపినట్లు కవిత ఆరోపించారు. ఈ విషయాలను అటు పార్టీ పెద్దగా ఉన్న కేసీఆర్, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ ఎందుకు గమనించలేదు? తెలిసినా ఇద్దరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక వేళ కవిత రాజకీయ ఎదుగుదలను హరీశ్ అడ్డుపడుతుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు వారించలేదు? అనే చర్చ జరుగుతున్నది. కవిత.. హరీశ్‌రావుపై చేసిన విమర్శల వెనుక ఏదో వ్యూహం దాగుందేమోననే అనుమానాలు గులాబీ లీడర్లను వెంటాడుతున్నాయి.

హరీశ్, సంతోష్‌లే టార్గెట్

హరీశ్‌రావు, సంతోష్‌రావు అవినీతిపై కవిత పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం గులాబీ పార్టీలో చర్చకు దారితీసింది. వారితో పాటే మరో నాయకుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని సైతం ఆమె టార్గెట్ చేశారు. ఆయన ఆస్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

కేసీఆర్ స్పందించేనా..

హరీశ్‌రావు, సంతోష్‌రావుపై కవిత చేసిన వ్యాఖ్యలపై గులాబీ అధినేత కేసీఆర్ స్పందిస్తారా? లేదా ? అన్న చర్చ జరుగుతున్నది. ఏకంగా పార్టీని చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్‌పై అధినేత ఏ మేరకు స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.

లిస్టులో ఇంకెంతమంది?

కవిత లిస్టులో ఇంకెంత మంది ఉన్నారు? అనే ప్రశ్న ప్రకంపనలు రేపుతోంది. తాజాగా.. హరీశ్‌రావు, సంతోష్‌రావుతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరునూ ఆమె ప్రస్తావించారు. మున్ముందు చాలా మంది కథలు ఉన్నాయంటూ హెచ్చరించారు. వన్ బై వన్ అన్నీ వెల్లడిస్తానంటూ చెప్పారు. పార్టీలో రెండు దశాబ్దాల పాటు క్రియాశీలంగా పని చేయడం.. ప్రభుత్వంలోనూ ఉండడంతో ఎవరెవరు ఏంటి? అనే విషయాలు ఆమెకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుందనేది అందరి అభిప్రాయం. కవిత మున్ముందు ఎవరి జాతకాలు బయట పెడుతారోనని కొందరు నేతల్లో భయం మొదలైనట్లు తెలుస్తోంది.

Next Story