లిక్కర్ స్కాంలో కవిత ఫిక్స్! 'Aam Aadmi'తో రూ. 100 కోట్ల డీల్

by Disha Web Desk 4 |
లిక్కర్ స్కాంలో కవిత ఫిక్స్! Aam Aadmiతో రూ. 100 కోట్ల డీల్
X

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. చేతికి మట్టి అంటకుండా వ్యవహారం నడుస్తుందని భావించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎమ్మెల్సీ కవిత గుట్టు ఎట్టకేలకు ఈడీకి చిక్కింది. తన సంభాషణలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఫేస్ టైమ్ వినియోగించినా ఫలితం లేకపోయింది. ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన నుంచి లిక్కర్ స్కాం భాగస్వామ్యం వరకు ఆమె ప్రమేయం ఎలా ఉన్నదో వివరిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు ఈడీ చార్జిషీట్ సమర్పించింది. వీటి ఆధారంగా కవితను, మాగుంట‌ను ఫిక్స్ చేసిన ఈడీ.. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనున్నదనేది ఆసక్తికరంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్ర ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన నుంచి లిక్కర్ కంపెనీల్లో భాగస్వామ్యం వరకు ఆమె ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు సమర్పించిన సమీర్ మహేంద్రు చార్జిషీట్‌లో ఈడీ ఈ వివరాలు వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కవిత చర్చలు జరిపి రూ. 100 కోట్ల డీల్ కుదిర్చారని, ప్రతిఫలంగా ఆమెకు ఎల్-1గా నిలిచిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు దక్కాయని వెల్లడైంది. ఇందులో మాగుంట శ్రీనివాసులు రెడ్డికీ వాటా ఉన్నది.


తొలుత బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ప్రాథమికంగా చర్చలు జరిగాయి. ఇందులో కవితతో పాటు బోయిన్‌పల్లి అభిషేక్, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రా రెడ్డి పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహకారంతో శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్, బుచ్చిబాబుతో కలిసి చార్టర్డ్ ఫ్లయిట్‌లో ఢిల్లీకి వెళ్లిన కవిత అక్కడే ఒబెరాయ్ మెయిడెన్ హోటల్‌లో తదుపరి చర్చలు జరిపినట్లు ఈడీ వివరించింది.


ఇండో స్పిరిట్స్ కంపెనీలో నేరుగా కవిత పేరు లేకపోయినా ఆమె తరఫున అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ప్రతినిధిగా వ్యవహారం నడిపారని తేలింది. ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రుతో ఎమ్మెల్సీ కవిత ఫేస్ టైమ్ (ఐఫోన్ లోని ఓ ఆప్షన్)లో సంభాషణలు జరిపారు. ఆ తర్వాత గతేడాది మే నెలలో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ముఖాముఖి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో కవిత భర్త ద్యావనపల్లి అనిల్ సైతం ఉన్నట్టు ఈడీ పేర్కొన్నది. ఈ వివరాలను నవంబరు 11న ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పిళ్లయ్ వెల్లడించారు.


ఢిల్లీ లిక్కర్ పాలసీలో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక బీజేపీ తన పరిధిలో ఉండే దర్యాప్తు సంస్థలతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఇటీవల కవిత ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి సంస్థలతో దాడులు చేయించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నదని, ఇలాంటివాటికి భయపడే ప్రసక్తే లేదని కూడా నొక్కిచెప్పారు. ఈ ప్రకటనల నేపథ్యంలో ఈడీ చార్జిషీటులో ఆమెకు ఈ స్కామ్‌తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో వివరాలతో సహా వెలుగులోకి రావడం రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సమీర్ మహేంద్రు అభియోగాలకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఆమోదించి జనవరి 5న ట్రయల్ ప్రారంభించనున్నట్లు జడ్జి ఎంకే నాగ్‌‌పాల్ ప్రకటించిన రోజునే ఈ వివరాలు బహిర్గతం కావడం గమనార్హం.

ఇద్దరికీ 65% వాటాలు

కవితతో కలిసి అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్, బోయిన్‌పల్లి అభిషేక్ గతంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటో దిగారు. ఈ ముగ్గురి మధ్య ఎలాంటి వ్యాపార సంబంధాలు ఉన్నాయో ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియలేదు. కానీ ఈడీ ఛార్జిషీట్‌ను చూసిన తరువాత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా సమీర్ మహేంద్రు డైరెక్టర్‌గా ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థలో కవితకు వ్యాపార భాగస్వామ్యం ఉన్నది వెలుగులోకి వచ్చింది. ఆమె తరఫున అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. బోయిన్‌పల్లి అభిషేక్‌తో కలిసి హైదరాబాద్‌లోని నివాసంలో ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో పైరవీలపై చర్చించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి కల్వకుంట్ల కవితకు 65% వాటాలు ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. కవిత తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ దీనిని ధ్రువీకరించారు.

ఆమె పేరుండదు.. అన్నీ ఆయనే..

ఎక్సయిజ్ పాలసీలో అనుకూలంగా ఉండే నిబంధనలు పెట్టడం ద్వారా ఏ మేరకు కిక్ బ్యాక్ రూపంలో లాభాలు తిరిగి వస్తాయో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కల్వకుంట్ల కవిత సంప్రదింపులు జరిపినట్లు గత నెల 11న పిళ్లయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని వివరాలను ఈడీ ప్రస్తావించింది. ఆప్ నేతలకు తొలుత అడ్వాన్సు రూపంలో సమకూర్చడం ద్వారా తిరిగి పాలసీ అమలైన తర్వాత హోల్‌సేల్ వ్యాపారుల ద్వారా లాభాలు వస్తాయని వివరించిన కవిత చివరకు ఇండో స్పిరిట్స్ కంపెనీలో షేర్ దక్కించుకున్నట్లు పిళ్లయ్ ఆ స్టేట్‌మెంట్‌లో తెలిపారు.


అయితే ఎక్కడా ఆమె పేరు ఉండదని, ఆమె తరఫున అన్నీ తానే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు కావాలంటే నిబంధనల ప్రకారం కాగితాల్లో (రికార్డుల్లో) కొన్ని వివరాలు చూపించాల్సి ఉంటుందని, దానిలో భాగంగానే కొద్దిమంది దగ్గర రుణాలు తీసుకున్నట్లు పేపర్లు సిద్ధం చేసినట్లు పిళ్లయ్ వివరించారు. ఇండో స్పిరిట్స్ వ్యాపార సంబంధాల కోసమే సమీర్ మహేంద్రును హైదరాబాద్ పిలిపించానని, తానే కల్వకుంట్ల కవితతో ఓ మీటింగ్ అరేంజ్ చేశానని పిళ్లయ్ తెలిపారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో పేరు తనదే ఉంటున్నా.. మొత్తం ఆర్థిక వ్యవహారం కల్వకుంట్ల కవితదేనంటూ తాను సమీర్‌కు స్పష్టంగా వివరించానని పిళ్లయ్ నొక్కిచెప్పారు.


శరత్ చంద్రా రెడ్డి లిక్కర్ హోల్‌సేల్ వ్యాపారం కన్నా రిటైల్ బిజినెస్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపారని తెలిపారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీటింగులో కవితతో పాటు విజయ్ నాయర్, దినేశ్​ అరోరా కూడా పాల్గొన్నట్లు తెలిపారు. వాస్తవానికి ఆ మీటింగుకు తాను హాజరుకాకపోయేవాడినని, కానీ ఎజెండా అంశాలను సెట్ చేసింది తానే అయినందున తప్పనిసరి పరిస్థితుల్లో అటెండ్ కావాల్సి వచ్చిందని పిళ్లయ్ వివరించారు. కిక్ బ్యాక్ రూపంలో ఎంత తిరిగొస్తుందో, లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ మీటింగులోనే చర్చించారని పిళ్లయ్ వెల్లడించారు.

ఎవిడెన్సులు ధ్వంసం

ఈ స్కామ్‌లో పరోక్షంగా ప్రమేయం ఉన్న వీ శ్రీనివాసరావు సైతం సెప్టెంబరు 19న ఈడీకి ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌లో కల్వకుంట్ల కవిత చెప్పినందునే తాను కోటి రూపాయలను పిళ్లయ్ కి అందజేసినట్లు తెలిపారు. కవితకు శ్రీనివాసరావు ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఈడీ పేర్కొన్నది. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తరఫున ప్రేమ్ రాహుల్ ఇండో స్పిరిట్స్ వ్యవహారాలను చూసుకున్నట్లు ఈడీ పేర్కన్నది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ తరఫున తాను డమ్మీ ఏజెంట్‌గా వ్యవహరించినట్లు స్వయంగా ప్రేమ్ రాహుల్ తెలిపారు. శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఉన్న ఐదు రిటైల్ జోన్లను అభిషేక్ నడిపిస్తున్నట్టు ఈడీ పేర్కొన్నది. కల్వకుంట్ల కవిత సహా మొత్తం 36 మంది వాడిన 170 ఫోన్లు, ఈ ఏడాది మే, ఆగస్టు మధ్యలో వాటిని మార్చేయడం, డిజిటల్ ఎవిడెన్సులను ధ్వంసం చేయడం తదితర అంశాలన్నింటినీ ఈ చార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్నది.

కింగ్ పిన్ చార్జిషీట్‌లో..

సమీర్ మహేంద్రును ఈడీ ఈ కేసులో 'కింగ్ పిన్'గా పేర్కొన్నందున ఆయనను ఏ-1గా పేర్కొని అభియోగాలను నమోదు చేసింది. వీటికి స్పెషల్ కోర్టు జడ్జి ఆమోదం తెలపడంతో జనవరి 5న ట్రయల్‌కు హాజరయ్యేలా సమన్లు జారీచేయాలని ఈడీని ఆదేశించారు. సమీర్ మహేంద్రుతో పాటు నాలుగు కంపెనీల ప్రతినిధులను కూడా ఈ ట్రయల్‌కు హాజరయ్యేలా చూడాలని జడ్జి ఎంకే నాగ్‌పాల్ పేర్కొన్నందున వాటిలో ఇండో స్పిరిట్స్, ఇండో స్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో కవిత, మాగుంట తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నవారి పేర్లు కంపెనీ రికార్డుల్లో ఉన్నట్లయితే వారు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఇండో స్పిరిట్స్ కంపెనీ కూడా ఈడీ చార్జిషీట్‌లో అక్యూజ్డ్‌గా ఉన్నందున ఏ రూపంలో కల్వకుంట్ల కవిత మెడకు చుట్టుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

8 కోట్ల పెట్టుబడికి 70 కోట్ల లాభం

ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో రిటైల్ దుకాణాలను దక్కించుకునేందుకు ఇండో స్పిరిట్స్ పేరుతో పుట్టుకొచ్చిన కొత్త కంపెనీ పెట్టుబడి కేవలం రూ. 8.40 కోట్లు మాత్రమే. పాలసీ అమలుతో రూ. 70 కోట్లు లాభాల రూపంలో వచ్చాయి. ఇందులో రూ. 32.5 కోట్లు కవిత బినామీ అరుణ్ పిళ్లయ్‌కి చేరాయి. బ్యాంకు ఖాతాలోకి రూ. 25 కోట్లు కాగా మిగిలిందంతా క్యాష్​! ఈ లాభాల్లో రూ. 1.35 కోట్లు బీఎండబ్ల్యూ కారుకు రూ. 49 లక్షలు ఫార్చూనర్ కారుకు, రూ. కోటి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌కు రూ. 70 లక్షలు ఇండియా ఎహెడ్‌కు చెల్లించినట్లు అరుణ్ పిళ్లయ్ ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. మరో రూ. 5 కోట్లు గచ్చి బౌలి సమీపంలోని శ్రీ హిల్స్ సమీపంలో నాలుగెకరాల భూమిని క్రియేటివ్ డెవలపర్స్ పేరుతో కొనుగోలు చేశారు.

Read More...

రైతులకు PM న్యూఇయర్ గిఫ్ట్.. అకౌంట్లో డబ్బులు పడేది అప్పుడే?

అర్వింద్‌కు కేంద్రమంత్రి పదవి?


Next Story

Most Viewed