Kavitha: ‘దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ’.. రాహుల్ పర్యటనపై కవిత సెటైర్

by Prasad Jukanti |   (  Updated:2025-04-26 05:52:11  IST  )

భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు.

Kavitha: ‘దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ’.. రాహుల్ పర్యటనపై కవిత సెటైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: భారత్ సమ్మిట్ (Bharat Summit) లో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ కు ఇవాళ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) విమర్శలు గుప్పించారు. 'మోసపూరిత హామీలు.. అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచి దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం' అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ, మీ సోదరి ప్రియాంకా గాంధీతో పాటు మిమ్మల్ని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. ఎర్ర బుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే మీరు తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో మానవ హక్కులను మంటకలుపుతూ దమనకాండ కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.. మీ మౌనం దేనికి సంకేతం? అని నిలదీశారు.

అరెస్టులు.. వేధింపులు.. బెదిరింపులు:

మీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ 16 నెలల పాలనలో తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిందని హైడ్రా, మూసీ పేరుతో పేద ప్రజల మీదికి బుల్డోజర్లు పంపిందన్నారు. లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందని సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిందని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షసకాండను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నిర్దారించిందన్నారు. కరెంట్‌ పోయిందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే అరెస్టులు.. వేధింపులు.. బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. హెచ్ సీయూలో పచ్చని అడవిని నాశనం చేస్తున్నారని నిరసనకు దిగితే విద్యార్థులపై లాఠీల మోతలు, అక్రమ కేసులు, అరెస్టులు చేశారని ఈ హైదరాబాద్‌ పర్యటనలో మీరు హెచ్‌సీయూను సందర్శించి లాఠీ దెబ్బలు తిన్న, వేధింపులకు గురైన విద్యార్థులను పరామర్శించాలన్నారు. బిహార్‌ లో విద్యార్థుల గోడు వినాలని వారి పక్షాన గళమెత్తిన మీరు తెలంగాణలో గ్రూప్‌ -1 అభ్యర్థుల ఆందోళనలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

ఆరు గ్యారంటీల పరిస్థితి ఏమిటి ?

రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని సగానికే పరిమితం చేశారని దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారని కవిత విమర్శించారు. అయినా మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2500, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు? ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు.

Next Story